న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ ప్రకటన వెలువడనుంది. దాదాపు 90 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకునే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియకు తొలి అడుగు పడనుంది. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 10 లక్షల పోలింగ్ కేంద్రాలలో ఎన్నిక జరగనుంది. ప్రస్తుత లోక్ సభ జూన్3వ తేదీతో ముగియనుంది. ఈసారి 7 నుంచి 9 దశలలో పోలింగ్ ఉండచ్చని అంచనా.
2014 సంవత్సరంలో ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు తొమ్మిది దశలలో పోలింగ్ జరిగింది. మే 16వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించారు. 2009 సంవత్సరంలో ఎన్నికల ప్రక్రియకు 75 రోజులు పట్టింది. కానీ 2014లో 72 రోజుల్లో ముగిసింది. ఆ ఎన్నికల్లో మోదీ హవా కనిపించడంతో బీజేపీ సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీ సాధించింది. 1984 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒక్క పార్టీ సొంతంగా ఇలా మెజారిటీ సాధించడం అదే తొలిసారి. బీజేపీ సొంతంగా 282 సీట్లు, ఎన్డీయేకు 336 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా 44 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో లోక్ సభలో పార్టీ నాయకుడైన మల్లికార్జున ఖర్గేకు ప్రతిపక్షనేత హోదా కూడా దక్కలేదు.
ఆ ఎన్నికల తర్వాతి నుంచి ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నెలకొల్పాలని ప్రధాని మోదీ పట్టుబట్టారు. పూర్తిగా ఐదేళ్ల పాటు పదవిలో ఉన్న రెండో కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ ఘనత సాధించారు. తొలుత అటల్ బిహారీ వాజ్ పేయి ఇలా పూర్తికాల ప్రధానిగా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా మోదీని అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో యూపీలో 80కి గాను 73, రాజస్థాన్ లో మొత్తం 25, మధ్యప్రదేశ్ లో 29కి గాను 27, ఛత్తీస్ గఢ్ లో 11కు 10 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలను బీజేపీ ఇప్పటికే కోల్పోయింది. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్ స్థానంలో బీజేపీ ఓడిపోయింది. మరోవైపు దాదాపు 21 ప్రతిపక్ష పార్టీలు ఒక్కతాటి మీద నిలబడి పోటీ చేయాలని తలపెడుతున్నాయి. మోదీ అంతం.. మా పంతం అని పట్టుబడుతున్నాయి. బీజేపీ మాత్రం నితీష్ కుమార్, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకోవడంతో పాటు శివసేనను కూడా దారిలోకి తెచ్చుకుంది. మోదీ, అమిత్ షా ఇప్పటికే వివిధ రాష్ట్రాలు చుడుతూ ప్రచారం చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగే ఎన్నికలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాల్సి ఉంది.