అమరావతి: అనంతపురం జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపి జెసి.దివాకర్రెడ్డి త్వరలో బిజెపి కండువా కప్పుకునేందుకు సన్నద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రీకొడుకులు దివాకర్రెడ్డి, పవన్కుమార్రెడ్డి ఇద్దరూ బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జెసి దివాకర్రెడ్డి ఢిల్లీలోని బిజెపి పెద్దలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇటీవల ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల సూర్యనారాయణ ఢిల్లీ వెళ్లి కాషాయం కండువా కప్పుకున్నారు. అదే బాటలో జెసి దివాకర్రెడ్డి కుటుంబం కూడా బిజెపిలోకి వెళ్లేందుకు సన్నద్ధం అయినట్లు సమాచారం.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయాన్ని చవి చూసిన నేపధ్యంలో ఆ పార్టీ నుంచి కొందరు ఇప్పటికే వలస బాట పట్టారు. మరి కొందరు అదే దారిలో ఉన్నారు. టిడిపిలో అత్యంత ముఖ్యులుగా చలామణీ అయిన నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా పార్టీని వీడి బిజెపి తీర్థం పుచుకున్నారు.
ఈ నేపథ్యంలో రాజకీయంగా తమ పట్టును నిలుపుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపియే మార్గమని పలువురు టిడిపి నేతలు భావిస్తున్నారు.
బిజెపి కూడా రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో సీనియర్ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బిజెపి ఆహ్వానంపై దివాకర్రెడ్డి కుటుంబం సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని దివాకర్రెడ్డి ఢిల్లీ బిజెపి పెద్దల వద్ద షరతు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి ఆ పార్టీ పెద్దలు కూడా కొంత సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది.
జెసి దివాకర్రెడ్డి, పవన్ మాత్రమే చేరతారా లేక ఆయన సోదరుడు జెసి ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిలు కూడా చేరతారా అన్నది తెలియాల్సి ఉంది. రాజకీయాల నుండి తప్పుకోవాలని భావించినప్పటికీ కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల జెసి ప్రభాకరరెడ్డి తెలిపిన విషయం విదితమే.
జెసితో పాటు అనంతపురం నగర కార్పొరేటర్లు, కల్యాణదుర్గం, శింగనమల, కదిరి, పుట్టపర్తికి చెందిన కొందరు ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా బిజెపి తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.