న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటేరియన్లకు క్రమశిక్షణలో క్లాసులు తీసుకోకతప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఆ దిశగా బుధవారం ఉదయం 80 మంది పార్లమెంట్ సభ్యులతో మొదటి సమావేశం నిర్వహించారు కూడా.
ఇండోర్లో కొద్ది రోజుల క్రితం జరిగిన సంఘటన మోదీని ఇందుకు పురికొల్పింది. బిజపి సీనియర్ నాయకుడు కైలాస్ విజయవర్గీయ కుమారుడు, ఇండోర్ శాసనసభ్యుడు ఆకాశ్ క్రికెట్ బ్యాట్ ఒకటి పట్టుకుని మునిసిపల్ కార్పొరేషన్ అధికారిని తరిమి కొట్టారు. పైగా బెయిల్పై బయటకువచ్చిన తర్వాత, తాను తప్పు చేయలేదని చెప్పుకున్నారు. మళ్లీ బ్యాట్ పట్టుకునే అవకాశం అధికారులు ఇవ్వరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఇండోర్ సంఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. ‘అదేం భాష. ఎవరైనా సరే సహించేది లేదు. ఎవరి కొడుకయినా సరే. ఒక ఎమ్మెల్యే తగ్గినా పరవాలేదు. కనీసం తర్వాత అయినా తప్పు తెలుసుకోకపోతే ఎలా’ అని ఆయన అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తన కుమారుడు బెయిల్పై బయటకు వచ్చినపుడు తండ్రి కైలాష్ అట్టహాసంగా స్వాగతం పలికారు. అనుచరులు గాలిలోకి తుపాకులు పేల్చారు. మిఠాయిలు పంచారు. ఆకాశ్ చేసిన పనిని కైలాష్ కూాడా సమర్దించారు. ఆకాశ్కు ఇంకా ఆట పూర్తిగా తెలియదని వ్యాఖ్యానించారు.