(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రత్నగిరి జిల్లాలోని తివారే ఆనకట్ట మంగళవారం రాత్రి తెగిపోయింది. ఫలితంగా దిగువన ఉన్న గ్రామాలు నీట మునిగి ఆరుగురు మృతి చెందారు. మరో 18 మంది గల్లంతయ్యారు.
రాత్రి 9:30 గంటల సమయంలో డ్యాము తెగింది. కింద ఉన్న అక్లే, రిక్తోలి, ఒవాలి, కల్కావ్నే, నందివాసే గ్రామాలు వరదముంపునకు గుయ్యాయి. 12 గృహాలు, 20 వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి.
19 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డ్యాము గతంలో పగుళ్లు చూపిందనీ, అధికారులకు సమాచారం అందించినా ఫలితం లేకపోయిందనీ ఐఎఎన్ఎస్ వార్తాసంస్థ తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతం ముంబై నగరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం అక్కడ జాతీయ విపత్తు సహయక దళం వారు సహాయ చర్యలు చేపట్టారు.
రుతుపవనాలు ఫలితంగా మహారాష్ట్రలో, రాజధాని ముంబైలో భారీగా వానలు పడుతున్నాయి. మంగళవారం నాడు 12 గంటల వ్యవధిలోనే ముంబైలో 30 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.