(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణలో హుజూర్నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా ? తాజా పరిణామాలు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేసిన టీఆర్ఎస్..తాజాగా జరిగే హుజూర్ నగర్ ఉపఎన్నికకు మాత్రం పొత్తు కోసం అన్వేషిస్తోంది. కలిసొచ్చే పార్టీలను కలుపుకుపోవాలని వ్యూహం రచిస్తోంది. ఇందుకోసం సీపీఐ మద్దతు కోరింది. ఆదివారం టీఆర్ఎస్ తరుపున ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ హుజూర్ నగర్ ఉప ఎన్నిక మద్దతు కోసం సీపీఐ నేతలతో చర్చలు జరిపారు.
అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో..మహాకూటమి పేరిట ఏర్పాటైన పలు విపక్షాలతో సీపీఐ కూడా చేతులు కలిపిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలిపిన సీపీఐ.. ప్రస్తుతం హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతుందా? లేదా అన్న విషయం ఆసక్తి కరంగా మారింది. యురేనియం ఆపాలని, పోడు భూముల విషయంలో తమ డిమాండ్లను సీపీఐ నేతలు..టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ అంశాలపై అధికార పార్టీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. పొత్తు విషయంపై అక్టోబర్ 1వ తేదీన కార్యవర్గ సమావేశంలో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీపీఐ నేతలు తెలిపారు. నిజానికి తాము పాత మిత్రులమే అని.. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్,సీపీఐ కలిసి పోరాడాయని గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే,టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇప్పటికే హుజూర్ నగర్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి.. గత ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు హుజూర్ నగర్ బరిలో దిగిన టీడీపీ..తమ అభ్యర్థిగా చామ కిరణ్మయిని ప్రకటించారు. కోట రామారావు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో బలాన్ని పెంచుకోవడానికి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో హుజూర్ నగర్ ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.