ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో ప్రారంభమైన రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రెండవ దశ పోలింగ్ నేటి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయింది.
ఒడిశాలో 35 అసెంబ్లీ, తమిళనాడులో 18 శాసనసభ స్థానాలకూ, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానాలకు కూడా నేడు పోలింగ్ కొనసాగుతోంది.
రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తమిళనాడులో 38, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్లో ఎనిమిది, అస్సాంలో ఐదు, బిహార్లో ఐదు, ఒడిషా ఐదు, ఛత్తీస్గఢ్లో మూడు, పశ్చిమ బెంగాల్లో ముడు, జమ్ముకాశ్మీర్లో రెండు, మణిపూర్లో ఒకటి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
త్రిపుర ఈస్ట్ పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు తమిళనాడులోని వెల్లూరు పార్లమెంట్ స్థానానికి జరుగనున్న ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సేలంలోని ఎడప్పాడిలో, సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నై సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీ కళాశాలలో, తమిళ సినీ నటులు అజిత్, ఆయన భార్య షాలిని, మరో సినీ నటుడు విజయ్లు, ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతి హాసన్లు చెన్నైలోని ఆల్వార్పేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీనటుడు ప్రకాశ్ రాజ్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్లు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సతీమణి, తనయుడుతో కలిసి పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిదంబరం శివగంగ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో సోలాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడి తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ ప్రక్రియ ్రపశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.