(గౌరవ్ శంకర్)
గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సోషల్ మీడియా పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను సమర్దంగా ఉపయోగించుకుని మోదీ ప్రధాని అయ్యారు. గత కొంతకాలంగా ఫేస్బుక్ ప్రకటనలు కూడా సేకరిస్తున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటీవలి కాలంలో ఈ ప్రకటనలు బాగా జోరందుకున్నాయి. 2019 ఫిబ్రవరి నుంచి మార్చి 2వ తేదీ వరకు వచ్చిన ప్రకటనలను ఫేస్బుక్ యాజమాన్యం విశ్లేషించింది. రాజకీయాలతో పాటు జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై మొత్తం 16,556 ప్రకటనలు వచ్చాయి. వాటికి వసూలైన మొత్తం అక్షరాలా రూ.4,13,88,087. అంటే నాలుగు కోట్ల పైమాటే. వీటిలో చాలావరకు బీజేపీ లేదా దాని అనుకూల సంస్థలు ఇచ్చినవే ఉన్నాయి. ప్రతి క్లిక్తో కమలం వికసించాలన్నదే వారి లక్ష్యంలా కనిపిస్తోంది.
2019 ఫిబ్రవరి నుంచి మార్చి 2 వరకు ‘‘భారత్ కీ మన్ కీ బాత్’’ అనే పేజీలో రూ. 1.01 కోట్ల ప్రకటనలు వచ్చాయి. ‘నేషన్ విత్ నమో’ అనే మరో పేజీకి రూ. 52.24 లక్షల యాడ్స్ వచ్చాయి. మూడో స్థానంలో రూ. 25.27 లక్షలతో ‘మైగవ్ ఇండియా’ అనే పేజీ ఉంది. ఈ ప్రకటనలు వేటిలోనూ డిస్క్లైమర్ లేనే లేదు. దాంతో ఆ ప్రకటనలు ఎవరిచ్చారో తెలియదు. ఇలా ఎవరిచ్చారో తెలియని వాటిని కూడా ఫేస్బుక్ ప్రత్యేకంగా గుర్తిస్తోంది. ఇక బీజేపీ సొంత ఖజానా నుంచి చెల్లింపులు జరిగిన ప్రకటనలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ‘‘భారత్ కే మన్ కీ బాత్’’ అనే పేజీలో డిస్క్లైమర్ ఉంది. దీనికి రూ. 18.47 లక్షల ప్రకటనలు వచ్చాయి. అలాగే ‘నేషన్ విత్ నమో’ అనే ఇంకో పేజీకి రూ. 11.86 లక్షల ప్రకటనలొచ్చాయి. ఇక బీజేపీ సొంత పేజీకి సైతం కేవలం రెండు ప్రకటనలతోనే రూ. 6.60 లక్షలు ఖర్చుపెట్టారు. ‘నమో మర్కండైజ్’, ‘అమిత్ షా’ అనే రెండు పేజీలకు కూడా ఎవరో తెలియని ప్రకటనకర్తలున్నారు. డిస్క్లైమర్ లేకుండా రూ. 2.12 లక్షలు, రూ.3.17 లక్షల చొప్పున వీటికి ప్రకటనలొచ్చాయి. ‘నమో మర్కండైజ్’ పేజీకి ఇన్స్టాగ్రాంలో బ్లూటిక్ ఉంది. దానికి సుమారు 8వేల మంది ఫాలోవర్లున్నారు. వీళ్లు ఫాలో అయ్యేది మాత్రం కేవలం ప్రధాని నరేంద్రమోదీ అధికారిక పేజీని మాత్రమే.
‘భారత్ కే మన్ కీ బాత్’ అనేపేజీకి ఎవరో చెప్పని ముసుగువీరులు ఫిబ్రవరిలో ఇచ్చిన ప్రకటనల విలువ రూ. 1,01,60,240. అదే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు చూసుకుంటే, రూ. 20.16 లక్షలతో ఆ వారంలో మొదటిస్థానంలో ఉంది.రెండు, మూడు, నాలుగు స్థానాలు కూడా వరుసగా ‘భారత్ కే మన్ కీ బాత్’, ‘నేషన్ విత్ నమో’, ‘మైగవ్ ఇండియా’లకు వచ్చాయి. వీటిలో వచ్చిన ప్రకటనల విలువ వరుసగా రూ. 18,47,555, రూ. 11,86,079, రూ. 9,13,786 చొప్పున ఉన్నాయి. ఇలా బీజేపీకి ప్రత్యక్షంగానే కాకుండా.. ముసుగువీరుల పేర్లతోనూ భారీ మొత్తంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలలో ప్రకటనలు వచ్చేస్తున్నాయి. కాషాయ పార్టీని గట్టెక్కించడానికి కోట్లాది రూపాయలను నీళ్లలా ఖర్చుపెడుతున్న ఈ అజ్ఞాతవ్యక్తులు ఎవరో మాత్రం ఇంతవరకు తెలియడం లేదు. ఇలాంటి ముసుగువీరులు ప్రకటనల మీద పెట్టే ఖర్చును ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందా? ఈ తరహా ఆన్లైన్ ప్రకటనలు లోక్సభ ఎన్నికలలో పెట్టే ఖర్చుల లెక్కల్లోకి వస్తాయా? ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
(న్యూస్ లాండ్రీ సౌజన్యంతో)