సీజేఐ కేసులో సుప్రీంను కోరిన మహిళ
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి తగిన సాక్ష్యం ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత, నివేదిక కాపీ తనకు కూడా ఇవ్వాలని ఫిర్యాదుచేసిన మహిళ కోరారు. ఈ మేరకు ఆమె కోర్టుకు లేఖ రాశారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని ప్రస్తావిస్తూ, రెండు పక్షాలకు నివేదికను పొందే హక్కు ఉంటుందని ఆమె చెప్పారు.
నివేదికను అందుకోవడానికి సమర్ధులైన తదుపరి సీనియర్ న్యాయమూర్తికి కమిటీ తన నివేదికను సమర్పించినట్లు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కార్యాలయం సోమవారం తెలిపింది. అలాగే సంబంధిత న్యాయమూర్తి అయిన ప్రధాన న్యాయమూర్తికి కూడా ఒక కాపీ పంపినట్లు చెప్పింది. నివేదికను బహిరంగ పరచకూడదని, అది లోపల మాత్రమే జరిగిన విచారణ అని స్పష్టం చేసింది. నివేదిక కాపీని ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అందిస్తే, తాను కూడా కాపీ పొందడానికి అర్హురాలినేనని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన కమిటీకి ఫిర్యాదుచేసిన మహిళ తాను రాసిన లేఖలో చెప్పారు.
‘‘కమిటీ నుంచి అందిన తొలి నోటీసులో గానీ, తొలి విచారణలో గానీ తాను పదే పదే అడిగినా విచారణ నాలుగు గోడల లోపలే జరుగుతుందా లేదా అన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం నివేదికను నాకు ఇవ్వకుండా ఉండడానికి ‘ఇన్ హౌస్’ నిబంధనలు చూపిస్తున్నారు. ఇందిరా జైసింగ్ వర్సెస్ సుప్రీంకోర్ట్ కేసులో తీర్పు ప్రకారం ఈ నివేదికను బయటపెట్టబోమని సెక్రటరీ జనరల్ చెప్పారు. అంటే, ఫిర్యాదు చేసిన నాయకు కూడా నివేదిక కాపీ ఇవ్వరని అర్థమవుతోంది’’ అని ఆమె అన్నారు. నివేదిక పొందే హక్కు తనకుందని, సాక్షులు చెప్పిన సాక్ష్యాలు, కమిటీ పరిగణించిన మరే ఇతర సాక్ష్యాలైనా అన్నీ తనకు అందాలని స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఫిర్యాదు చేసిన వారికి నివేదిక కాపీ ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పైగా కమిటీ అందుకు కారణాలు కూడా తనకేమీ చెప్పలేదన్నారు.
‘‘ఫిర్యాదు చేసిన మహిళకు నివేదిక ఇవ్వకపోవడం సహజన్యాయ సూత్రాల ఉల్లంఘన అవుతుంది, పూర్తి న్యాయవిరుద్ధం అవుతుంది. సమాచార హక్కు చట్టం రావడానికి ముందు ఈ తీర్పు ఇచ్చారు. ఆస్తుల వెల్లడి కేసులో ఢిల్లీ హైకోర్టు ఫుల్ బెంచి తీర్పును బట్టి చూసినా, ఆ నివేదికను ఆర్టీఐ కింద ఏ పౌరుడైనా పొందవచ్చు. జడ్జిల ఆస్తుల వివరాలు కూడా ఏ పౌరుడైనా ఆర్టీఐ కింద పొందవచ్చని ఫుల్ బెంచి తెలిపింది’’ అని ఆమె అన్నారు. తనకు కేవలం తన ప్రకటనల కాపీలు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఈ విషయంలో తర్వాత ఏం చేయాలో తన న్యాయవాదిని సంప్రదిస్తానన్నారు.