హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ అయింది. ప్రైవేటీకరణపై దాఖలైన రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్నిసవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశరవావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. వాదప్రతి వాదనలు విన్న తర్వాత పిటిషన్ ను కొట్టివేసింది. మోటారు వాహనచట్టం-1988 సెక్షన్ 102 ప్రకారం రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వానికి విస్తృత అధికారాలున్నాయని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది హైకోర్టు. దాంతో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.
ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు ఆర్టీసీపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని ఏజీ తెలిపారు. ప్రభుత్వ పాలసీ విధానాలలో పిటిషనర్ల జోక్యం తగదని సూచించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఏజీ ప్రస్తావించారు. రూట్ల ప్రైవేటీకరణ అమలు బాధ్యత ఎవరికి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారం అప్పగిస్తున్నట్టు.. కేబినెట్ తీర్మానంలో ఉందని కోర్టు తెలిపింది. ప్రభుత్వం వేరు… అథారిటీ వేరు.. ప్రభుత్వం చేయాల్సిన పని అథారిటీ ఎలా చేస్తుందని న్యాయస్థానం అడిగింది. అనంతరం ఏజీ వినిపించిన వాదనలతో కోర్టు ఏకీభవించింది.
ప్రైవేట్ రూట్ల కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఆర్టీసీ భవితవ్యం, కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై సీఎం కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఇటు కార్మికులు..అటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
ఇదిఇలా ఉంటే.. గురువారం ఆర్టీసీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో.. ఆర్టీసీ అప్పులను భరించే స్థితిలో ప్రభుత్వం లేదని, ఆర్టీసీని యథాతథంగా నడపటం సాధ్యం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంతోపాటు.. ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.