మొత్తం పంట తీసేయాలన్న అధికారులు
వంగ వేయడమే నేరమా అంటున్న రైతు
ఫతేబాద్ (హర్యానా): పురుగులు ఆశించకుండా నూటికి నూరుశాతం దిగుబడి వస్తుందంటే అధిక ధర పెట్టి మరీ కొన్నారు. పంట కూడా మరికొద్ది కాలంలో చేతికి వచ్చేస్తుంది. అలాంటి సమయంలో ఉన్నట్టుండి వ్యవసాయ శాస్త్రవేత్తలు దిగారు. ఏవో పరీక్షలు చేయాలన్నారు. చివరకు మొత్తం మొక్కలన్నీ పీకేసి భూమిలో బాగా లోతున పాతేయాలని ఆదేశించారు. ఎందుకని ఆ రైతు ఆందోళనగా అడిగితే వారు చెప్పిన సమాధానం… ‘అది బీటీ వంగ’. మన దేశంలో ఒక్క పత్తికి తప్ప మరే పంటకూ బీటీ రకాలు వాడకూడదని కేంద్ర ప్రభుత్వం 2010లోనే (యూపీఏ హయాం) ఆదేశించింది. కానీ ఈ విషయం తెలియని సైనీ అనే రైతు తనకున్న అర ఎకరం పొలంతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని మరీ ఈ రకం వంగను సాగుచేశాడు. రోడ్డు పక్కన అమ్ముతుంటే ఒక్కో మొక్కను రూ. 7 చొప్పున అతడు కొనుగోలు చేశాడు. మామూలుగా అయితే మొక్క ఖరీదు ఒక్క రూపాయే. దీనిపై ఫిర్యాదులు రావడంతో నేషనల్ బ్యూరో ఫర్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్.బి.పి.జి.ఆర్) అధికారులు వచ్చి శాంపిళ్లు తీసుకుని పరిశీలించారు. కమిటీ నివేదిక ఇచ్చిందని, మొత్తం పంటను లోతుగా కప్పేయాలని, లేకపోతే పక్కనున్న పొలాలపై కూడా ప్రభావం పడుతుందని హర్యానా వ్యవసాయ వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కేపీ సింగ్ చెప్పారు.
కుదరతీ ఖేతీ అభియాన్ అనే సంస్థకు చెందిన రాజీందర్ చౌదరి ఈ పంటపై ఫిర్యాదు చేశారు. ఆయన మహర్షి దయానంద్ యూనివర్సిటీలో మాజీ ప్రొఫెసర్. తన స్నేహితులలో ఒకరు ఇంట్లో పురుగులు ఆశించని వంగ సాగు చేయాలనుకున్నారని, అప్పుడే ఫతేబాద్ లో సైనీ పొలం గురించి తెలిసిందని అన్నారు. సైనీకి వంగనారు అమ్మిన వ్యాపారి ఇప్పుడు కనిపించడం లేదు. తమ పొరుగువారైన జోగీందర్ ధిండ్సాతో కలిసి తన కుమారుడు జీవన్ 2017 డిసెంబరులో తొలిసారి ఈ మొక్కలు కొన్నాడని సైనీ చెప్పారు. వంగను ఆశించే పురుగుల వల్ల అంతకుముందు పంట మొత్తం నాశనం అయ్యేదన్నారు. కానీ ఈ రకం పంటను గతేడాది రూ. 20వేలకు అమ్మానని, దానిపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. ఇంట్లోనూ అవే వాడామని, తమకు తేడా ఏమీ లేదని చెప్పారు. ఈ ఏడాది కూడా ధర బాగుందని, కానీ అధికారుల సూచనతో తాము వాటిని అమ్మడం ఆపేశామని తెలిపారు. సైనా, రాణిలకు ఇద్దరు కొడుకులు , ఒక కుమార్తె ఉన్నారు. వారంతా కలిసి వంగ సాగు చేస్తారు.
బీటీ వంగ పెంచడం చట్ట విరుద్ధమని, అందువల్ల దాన్ని మొత్తం తీసేయాలని అధికారులు అంటున్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వానికి తెలిపింది. అయితే, ఈ విషయాలేవీ తమకు తెలియవని, పురుగులు ఆశించకపోవడం వల్ల దిగుబడి బాగుంటుందని కొన్నాం తప్ప, ఇది నేరమన్న విషయం కూడా తెలియదని రైతు దంపతులు వాపోతున్నారు. ఇప్పుడు ఎంచక్కా ఎదిగిన పంటను చేతులారా తీసేయాలంటే వారికి మనసొప్పడం లేదు. ఈ విషయంలో రైతులను వేధించకూడదని, వాళ్లకు జన్యుపరివర్తిత పంటల వల్ల కలిగే నష్టాలు తెలియవని హర్యానా రైతు నాయకుడు సుభాష్ పూనియా అన్నారు.