హిందువులకు వ్యతిరేకంగా ఫేస్ బుక్ పోస్టులు
ఏ మతాన్నీ విమర్శించలేదన్న సునీల్ కుమార్
మనోభావాలు దెబ్బతిన్నాయనే ఫిర్యాదు: తివారీ
ముంబై: చేతిలో ఫేస్ బుక్ ఉంది కదాని ఏది పడితే అది రాస్తే తీసుకెళ్లి జైల్లో పెడుతున్న రోజులివి. హిందువులకు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఇలాగే పోస్ట్ చేసినందుకు అరెస్టయిన ముంబై డాక్టరుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అయితే తాను ఏ మతాన్నీ కించపరచలేదని, అంటరానితనం లాంటి బ్రాహ్మణవాదాన్నే విమర్శించానని డాక్టర్ సునీల్ కుమార్ నిషాద్ అన్నారు. ‘‘ఫిర్యాదు చేసింది ఎవరో కూడా నాకు తెలీదు. ఏ మత విశ్వాసాలను బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. నేను చెప్పినదంతా వాస్తవాలు, కొన్ని కేసులు, హఐకోర్టు ఉత్తర్వులను బట్టే చెప్పాను. ఎవరికైనా సమస్య ఉంటే వాళ్లు ఆ వాస్తవాలేంటో చెప్పి నాతో మాట్లాడచ్చు’’ అని ఆయన ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’తో అన్నారు.
విఖ్రోలి ప్రాంతంలో హోమియో వైద్యుడిగా ప్రాక్టీసు చేస్తున్న నిషాద్ పై సామాజిక కార్యకర్త, శివసేన సభ్యుడు అయిన రవీంద్ర తివారీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో నిషాద్ పై ఎఫ్ఐఆర్ దాఖలైంది. దాన్ని రద్దు చేయించేందుకు తాము బాంబే హైకోర్టుకు వెళ్తామని ఆయన న్యాయవాదులు చెప్పారు. డాక్టర్ నిషాద్ కూడా హిందువేనని, అతడు ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోలేదని.. కేవలం బ్రాహ్మణవాదాన్నే తప్పుపట్టారని ఐఎంఏకు చెందిన డాక్టర్ సునీల్ యాదవ్ కోర్టుకు చెప్పారు. అంటరానితనాన్ని డాక్టర్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే కూడా ఖండించారని, వాటికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కేసులు ఎందుకు పెట్టరని ఆయన అడిగారు.
నిషాద్ పెట్టిన పోస్టుల వల్ల తన మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేసిన తివారీ చెప్పారు. అలాంటి పోస్టులు పెట్టొద్దని తాను ఆయనకు సూచించిన, గత రెండేళ్లుగా అదే పని చేస్తూ వస్తున్నారని, ఇటీవల తనకు తెలిసిన వాళ్లు అతడి వద్దకు చికిత్స కోసం వెళ్తే వాళ్లతోనూ అవే మాటలు చెప్పడం మొదలుపెట్టాడని, అప్పుడే తాను ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నానని తెరలిపారు.అతడికి బెయిల్ వచ్చినా పర్వాలేదని, అయితే భవిష్యత్తులో ఇలాంటి పోస్టులు పెట్టకుండా ఉంటే చాలని అన్నారు. ఫేస్ బుక్ లో దాదాపు 4996 మంది ఫ్రెండ్స్ ఉన్న నిషాద్.. తరచు ఈవీఎంల సామర్ధ్యాన్ని ప్రశ్నించడం, సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకుర్ తదితరులను విమర్శించడం లాంటి పోస్టులు పెడుతుంటారు.