న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కోసం సిబిఐ, ఇడి వేట మొదలుపెట్టాయి. ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన తర్వాత ఆయన కనబడకుండా పోయారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి ఇడి నోటీసు అంటించింది. మరోపక్క సిబిఐ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లిన చిదంబరం లాయర్లు తక్షణ ఆదేశాలు సంపాదించలేకపోయారు. అప్పీలును లిస్టింగ్ కోసం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచాలని జస్టిస్ రమణ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. దీనితో చిదంబరానికి అరెస్టు ముప్పు నుండి ఎలాంటి ఊరట లభించలేదు.
మరో వైపు బుధవారం తెల్లవారుజామున సిబిఐ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఢిల్లీ హైకోర్టులో తీర్పు వెలువడినప్పటి నుండి సిబిఐ బృందం ఆయన ఇంటికి మూడు సార్లు చక్కర్లు కొట్టింది. చిదంబరం దేశం విడిచి విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు సిబిఐ లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది.
చిదంబరం ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు 305 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు అందేందుకు సహకరించారనీ, దీనికి బదులుగా చిదంబరం కుమారుడు కార్తీకి ముడుపులు ముట్టాయని సిబిఐ కేసు నమోదు చేసింది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సిబిఐ అధికారులతో పాటు ఇడి కూడా ఆయన కోసం గాలిస్తోంది. సిబిఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉండటంతో చిదంబరం ఇటు ఢిల్లీ, అటు చెన్నైలోని తన నివాసాలకు దూరంగా ఉన్నారు. ఆయన సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.