(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పధకానికి నిధులు విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి అమలు కానున్న ఈ పధకానికి 5,510 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఆదివారం జీవో జారీ అయింది. ముఖ్యమంత్రి జగన్ 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో ఈ పధకం అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పధకం కింద అర్హత ఉన్న రైతులకు ఏడాదికి 12,500 రూపాయల ఆర్ధిక సాయం అందిస్తారు.
మరో రెండు రోజుల్లో రైతు భరోసా పధకం అమలు చేయాల్సిఉండగా ఇంతవరకూ లబ్దిదారుల లెక్కలు ఖరారు కాలేదు. ఈ పధకానికి రాష్ట్రంలో దాదాపు 53 లక్షల రైతు కుటుంబాలు అర్హత సాధిస్తాయని భావించారు. తీరా చూస్తే ఇప్పటికి అందులో సగం కుటుంబాలు కూడా లెక్క లోకి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలతో ప్రభుత్వం దగ్గరున్న రైతుల జాబితాలు సరిపోలడం లేదు.
ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసినపుడు రైతు భరోసా పధకం ప్రారంభించేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆయనను కోరారు. అయితే మోదీ అందుకు సానుకూలంగా స్పందించలేదని మీడియా రిపోర్టు చేసింది. భరోసా కింద రైతుకు ఇచ్చే డబ్బులో సగం కేంద్రం నుంచే వస్తున్నప్పటికీ వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో అదేదో తమ సొంత పధకంలా వైసిపి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గుర్రుగా ఉందని చెబుతున్నారు.