యొకహామా: కొత్త రాజు సింహాసనాన్ని అధిష్ఠించిన సందర్భంలో జపాన్ ప్రజలందరికీ పది రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మామూలుగా అయితే అంతా సంబరాల్లో మునిగి తేలాలి. కానీ అక్కడ మాత్రం చాలామంది తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయారు. ఏప్రిల్ 27 నుంచి మే 6వ తేదీ వరకు సెలవులు ఇవ్వడంతో సగానికి పైగా ఉద్యోగులు అసంతృప్తికి గురయ్యారట. ఇలాంటి సెలవులు వస్తే ధనవంతులు మాత్రమే సంబరపడతారని, అంత ఎక్కువ రోజులు సెలవులు వద్దని ఎక్కువ మంది చెబుతున్నారు. ప్రయాణాలు ఖరీదు కావడం, పర్యాటక ప్రాంతాలలో రద్దీ పెరగడం, బ్యాంకులు, పిల్లల సంరక్షణ కేంద్రాలు మూతపడటం, చిన్న వ్యాపారాలు నష్టాల్లో ఉండటంతో ఈ సెలవులను ఆస్వాదించడానికి వీల్లేకుండా పోయింది.
చాలామంది జపనీయులకు ఈమెయిల్ ఆందోళన నుంచి సామాజిక ఆందోళన వరకు సమస్యలను రెట్టింపు చేస్తున్నాయట. ఆధునిక జపాన్ దేశంలో పని ఎక్కువ కావడం, అసమానతలు, సామాజిక అల్లిక అన్నీ సమస్యలుగానే ఉన్నాయి. జపాన్ పరిశ్రమలలో పనివారికి చాలామందికి తగినంత విరామం ఉండదు. పైగా, కార్మికుల సంఖ్య తక్కువ కావడంతో ఉన్నవారితో అధిక సమయం పని చేయిస్తున్నారు. ఇలాంటి సమయంలో పది రోజుల సెలవును ఎవరూ మెచ్చుకోవడం లేదని నికై అనే ఫైనాన్షియల్ వార్తాపత్రిక తన కథనంలో పేర్కొంది.
కొందరికి పది రోజుల సెలవులు వస్తే మరికొందరికి పది రోజుల నిరంతర పని ఉంటుందని ఒకరు ట్వీట్ చేయగా, దాన్ని 1.20 లక్షల సార్లు షేర్ చేసి, లైక్ చేశారు. ఒక డిపార్ట్ మెంటల్ స్టోర్ ఉద్యోగి ఆ ట్వీట్ చేశారు. కనీసం ఈ సమయంలో కూడా వారాంతపు సెలవులు తీసుకోడానికి కూడా సాధ్యపడని ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని నికొనికొ అనే బ్లాగ్ లో రాశారు. తాను పనిచేసే హోటల్ ఎప్పుడూ నిండుగా ఉండటంతో తనకు కనీసం వారాంతపు సెలవులు కూడా ఉండటం లేదని 30 ఏళ్ల మహిళ ఫిర్యాదుచేశారు. ప్రభుత్వం 10 రోజుల సెలవులు ఇస్తే, సేవారంగంలోని వాళ్లు ఎందుకు తీసుకోకూడదని ఆమె నిలదీశారు. సెలవుల సమయంలో కనీసం జీతాలైనా పెంచితే బాగుండేదని అన్నారు.
జపాన్ రాజు షోవా పుట్టిన రోజు నుంచి పిల్లల దినోత్సవం వరకు ఉండే వరుస సెలవులను గోల్డెన్ వీక్ అంటారు. ఆ సమయంలో ఎక్కువ మందికి సెలవులు వస్తాయి. దాన్ని సినిమాలు చూసేందుకు ఉపయోగించుకుంటారని సినీజీవులే ఈ పదాన్ని తొలుత సృష్టించారు. ఈ సంవత్సరం రాజు అకిహిటో పదవీవిరమణ చేసి, తర్వాత ఆయన కుమారుడు నరుహిటో సింహాసనాన్ని అధిష్ఠించడంతో సెలవులు పెంచారు. దీంతో చాలా కార్యాలయాలు మూతపడ్డాయి. జపాన్ లోని కోకాకోలా కంపెనీలో 600 మంది పనిచేస్తున్నారు. వారిని సర్వే చేసినపుడు మూడింట రెండొంతుల మంది సెలవులకు ముందు ఒత్తిడి ఎక్కువైందని చెప్పారు. సెలవుల తర్వాత వచ్చే టన్నుల కొద్దీ ఈమెయిళ్లు తలుచుకుంటే చాలా కష్టంగా ఉందని ఓ మహిళ అన్నారు. ఈ సమయంలో పని కూడా పేరుకుపోతుందని మరో మహిళ ఆందోళన చెందారు.
సెలవులు లభించినవారిలో మాత్రం దాదాపు 75 శాతం మంది ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారని మైజి యసుడా ఇన్సూరెన్సు కంపెనీ చేసిన సర్వేలో తేలింది. మరికొందరు ప్రత్యేకంగా ఏమీ ప్లాన్ చేసుకోలేదన్నారు. విమాన టికెట్లు, హోటల్ అద్దెలు బాగా పెరిగిపోవడంతో కొందరు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. అలాంటివాళ్లంతా ఇళ్లకే పరిమితమై టీవీలు లేదా డీవీడీలు చూసుకుంటూ గడిపేస్తున్నారు. ఇక గృహిణులైతే సెలవుల గురించే ఆలోచించలేదు. అందరూ ఇళ్లలో ఉంటే వారికి వంట పని ఎక్కువవుతుందని వారి ఆందోళన. మరికొందరు ట్రాఫిక్ పెరుగుతుందని, అనవసర ఖర్చులు పెరుగుతాయని అనుకుంటున్నారు.
కొందరు ఇంకా పనిచేయాల్సి ఉంటున్నా, వారి పిల్లలను ఉంచే సంరక్షణ కేంద్రాలు మాత్రం మూతపడ్డాయి. దాంతో అలాంటి కుటుంబాలకు ఏం చేయాలో తెలియడం లేదు. ఈ సమయంలో తెరిచే కేంద్రాలకు సబ్సిడీలు ఇస్తామని స్థానిక ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఆసుపత్రులలో తగినంత మంది వైద్యులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సామాన్యులు పడుతున్న కష్టాలు ప్రధాని షింజో అబె, విదేశాంగ మంత్రి టారో అసోలకు తెలియడం లేదని పత్రికలు మండిపడుతున్నాయి.