న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారిణి రొమిల్లా థాపర్ను తన బయోడేటా సమర్పించాల్సిందిగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కోరడంపై నిరసన వెల్లువెత్తుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత శశి థరూర్ జెఎన్యు పాలకవర్గంపై ధ్వజమెత్తారు. జెఎన్యు ఇంతకన్నా ఇంకా దిగజారగలిగింది ఏమన్నా ఉంటుందా అని ఆయన ట్వీట్ చేశారు.
జెఎన్యు ఎమిరటస్ ప్రొఫెసర్ అయిన రొమిల్లా ధాపర్ ఆ గౌరవ హోదాలో కొనసాగాలో వద్దో పరిశీలిస్తామనీ, అందుకు తాజా బయోడేటా పంపాలనీ జెఎన్యు రిజిస్ట్రార్ జూలై నెలలో థాపర్కు లేఖ రాశారు. జెఎన్యులో ఉన్న అందరు ఎమిరటస్ ప్రొఫెసర్లకూ ఇలా లేఖలు వెళ్లాయి.
ప్రొఫెసర్గా కొనసాగాలంటే బయోడేటా పంపాలని రొమిల్లా థాపర్ను కోరడం అవమానించడం కన్నా ఘోరమైన పని. విద్యా విలువలు, నియమాలకు, మేధోపరమైన ఉన్నతికీ వ్యతిరేకంగా పెద్ద నేరం అని శశి థరూర్ ట్వీట్ చేశారు.
JNU asking Romila Thapar to submit a cv to JNU to continue her Professor Emerita status is worse than an insult, it is a crime against the values & principles of education & respect for intellectual merit. Can JNU sink any lower? https://t.co/mb9widqiNu
— Shashi Tharoor (@ShashiTharoor) September 1, 2019
రొమిల్లా థాపర్ను ఇలా అవమానించడం మరో రాజకీయ ప్రేరేపితమైన చర్చ అని జెఎన్యు అధ్యాపకుల సంఘం విమర్శించింది. జెఎన్యును ఏ విలువలు, ఏ ఆదర్శాలతో స్థాపించారో వాటితోనే యూనవర్సిటీని నడిపాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులకూ, టీచర్లకూ మద్దతుగా స్ఫూర్తిగా నిలిచినందుకు ఆమెను ఇలా అవమానిస్తున్నారని సంఘం వ్యాఖ్యానించింది.
తాము నియమాలకు విరుద్ధంగా ఏమీ చేయలేదని జెఎన్యు పాలకవర్గం సమర్ధించుకుంది. రొమిల్లా థాపర్ను హిందుస్థాన్ టైమ్స్ సంప్రదించగా, తనకు జూలైలో లేఖ వచ్చినమాట నిజమేననీ, తనకు ఎమిరటస్ గౌరవం జీవితకాలానికి ఇచ్చిన విషయం గుర్తు చేస్తూ జవాబు పంపాననీ చెప్పారు.