చెన్నై: అన్ని మతాల్లోనూ తీవ్రవాదులు ఉన్నారనీ, ఎవరూ తమకు తాము పవిత్రులం అని చెప్పుకోలేరని ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ అన్నారు.
గత వారం ఆయన ‘హిందూ తీవ్రవాదం’ అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం విదితమే. దీనిపై పలు హిందూ సంస్థల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి కమల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
గురువారం ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా ‘భారత్ మాతాకీ జై’ అంటూ పలువురు ఆయనపై చెప్పులు విసిరారు.
ఈ పరిణామాలపై స్పందించిన కమల్ హాసన్ తనపై జరుగుతున్న దాడులు, వస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
ప్రజల్లో శాంతి నెలకొల్పడమే తన లక్ష్యమనీ. అందు కోసం హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతున్నానని కమల్ హాసన్ అన్నారు.
ఈ నెల 12న తమిళనాడులోని అరువకురిచిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కమల్ హాసన్ నాధురామ్ గాడ్సే ‘తొలి ఉగ్రవాది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
ఉగ్రవాదానికి మతం ఉండదనీ, ఒక వ్యక్తి చేసిన తప్పునకు ఒక వర్గం మొత్తాన్ని దూషించడం తప్పని హిందుత్వ వాదులు పేర్కొంటున్నారు. కమల్ హాసన్ వేర్పాటువాద రాజకీయాలకు పాల్పడుతున్నారంటున్నారు. కమల్ వ్యాఖ్యలపై బిజెపితో పాటు పలు హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కమల్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కూడా పలువురు ఈసిని ఆశ్రయించారు.
కమల్పై చర్యలు తీసుకోవాలంటూ హిందూ శివసేన సంస్థ అధ్యక్షుడు విష్ణుగుప్తా దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. కమల్ చేసిన ‘హిందూ తీవ్రవాదం’ వ్యాఖ్యలకు ఆధారాలు సమర్పించాలని పిటిషనర్ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు రెండుకు వాయిదా వేసింది.