(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో సీఎం కేసీఆర్ కు కొత్త సమస్యలు వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గవర్నర్ కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై ఆమె స్పందించారు. ఆర్టీసీ సమ్మెతో సామాన్యులు ఇబ్బంది పడకుండా చూడాలని రాష్ట్ర యంత్రాంగానికి స్పష్టం చేశారు. సమ్మె కారణంగా సర్వీసులు నిలిచిపోయిన క్రమంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని ఆది నుంచి చెబుతూ వస్తున్న కేసీఆర్.. కార్మికుల ఆత్మహత్యల తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారినా.. అదే వైఖరిని కొనసాగిస్తున్నారు. అయితే, గవర్నర్ ఆదేశాలతో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది.
గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నంత కాలం కేసీఆర్ కు ఎలాంటి సమస్యలు రాలేదు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్.. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి అధికారాన్ని దక్కించుకున్నారు కేసీఆర్. గడిచిన ఐదేళ్ల కాలంలో నరసింహన్.. కేసీఆర్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారు. ఇదే సమయంలో నరసింహన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ప్రభుత్వంపై విపక్షాలు చేసే ఫిర్యాదులను పట్టించుకోలేదని పలు పార్టీల నాయకులు నరసింహన్ పై గతంలో ఆరోపణలు కూడా చేశారు. అయితే, తెలంగాణకు కొత్త గవర్నర్ గా తమిళిసై రావడంతో కేసీఆర్ కు అసలు కష్టాలు మొదలైయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికులు రోడ్డెక్కారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు చేసిన ఉద్యమం తరహాలో కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. వీరికి విపక్ష పార్టీలు తమ మద్దతు కూడా ఇస్తున్నాయి. దీంతో సమ్మె తీవ్ర రూపం దాల్చింది.
తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలను కేంద్రం కూడా పరిశీలిస్తోందట. అసలే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి.. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఓ ఆయుద్ధంగా మారింది. కేంద్రం ఆదేశాలతోనే గవర్నర్ తమిళిసై ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించినట్లు చర్చ చరుగుతోంది. నిజానికి తమిళిసై గవర్నర్ గా రావడం కేసీఆర్ కు ఇష్టం లేదంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ దుర్వినియోగం చేయడంపై సర్కారియా కమిషన్ సిఫార్సులను ఎత్తి చూపుతూ సీఎం కేసీఆర్ సీపీఆర్వో జ్వాలా నరసింహారావు వనం రాసిన వ్యాసం చర్చనీయాంశంగా మారింది. ఆమె గవర్నర్ గా రాష్ట్రానికి రాకముందు తమిళనాడు బీజేపీ చీఫ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కేసీఆర్ కు సహకరించరనే వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే బీజేపీ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో నరసింహాన్ గవర్నర్ గా ఉన్నప్పుడు తరచూ కేసీఆర్ ఆయనను కలిసేవారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలను ఆయనతో చర్చించేవారు. కానీ తమిళిసై తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ ఆమెను కలిసింది చాలా తక్కువ. తాజాగా ఆర్టీసీ కార్మికుల విషయంలో గవర్నర్ సీరియస్ గా ఉండటంతో కేసీఆర్ కు కొత్త చిక్కులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకమీదట కేసీఆర్ సర్కార్ పై వచ్చే ఫిర్యాదులపై గవర్నర్ ఎలా వ్యవహరిస్తారనేది అంతుచిక్కని విషయంగా మారింది.