అసలే మన దేశంలో పరిశోధనలు తగ్గిపోతున్నాయని గందరగోళం నెలకొంటోంది. ఇలాంటి సమయంలో.. పీహెచ్డీలపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో విసుగెత్తిన కేరళ ప్రొఫెసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిపారేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ(సీయూకే)కు చెందిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ కంపారిటివ్ లిటరేచర్ సభ్యురాలు ప్రొఫెసర్ మీనా టి పిళ్లై రాజీనామా చేశారు. పీహెచ్డీ స్కాలర్ల కోసం ‘జాతీయ ప్రాధాన్యం’ ఉన్న అంశాలనే ఎదుర్కోవాలని ఉత్తర్వులు వచ్చాయి. ఈ తరహా ప్రాజెక్టుల జాబితా తయారుచేయాలని సీయూకే అందరు శాఖాధిపతులకు ఒక లేఖ పంపింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి ఈ మేరకు సూచన వచ్చింది. గత డిసెంబరులో జరిగిన సెంట్రల్ యూనివర్సిటీల వీసీల సమావేశంలో సంబంధంలేని అంశాలలో పరిశోధనలను ప్రోత్సహించవద్దని చెప్పారు. ‘‘పీహెచ్డీలకు ఫెలోలను చేర్చుకునేటపుడు, అంశాలు జాతీయ ప్రాధాన్యానికి అనుగుణంగా ఉండాలి. అలాంటి అంశాలనే విద్యార్థులకు కేటాయించాలి’’ అని ఆ సమావేశంలో చెప్పారు.
దాంతో జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలేంటో వెంటనే తేల్చాలని అందరు డీన్ లు, శాఖాధిపతులను సీయూకే కోరింది. దాన్నిబట్టి చూస్తే జాబితాలో ఉన్న అంశాలపై మాత్రమే పరిశోధన చేస్తామని విద్యార్థులు చెప్పాలి. ప్రస్తుతం పీహెచ్డీ అనేది యూనివర్సిటీలో ఇంటర్వ్యూ సమయంలో వాళ్లు సమర్పించే థీసీస్ ఆధారంగా ఉంటోంది. ప్రతిపాదనను ప్యానల్ ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు లేదా కొన్ని మార్పులు సూచించవచ్చు. సాధారణంగా తమకు ఇష్టమైన అంశాలపై పరిశోధన చేయడానికి విద్యార్థులకు అవకాశం ఉంటుంది. యూనివర్సిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ ఆఫ్ కేరళకు చెందిన మీనా టి. పిళ్లై సీయూకే పదవికి రాజీనామా చేశారు. ఆమె బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో బయటి సభ్యురాలు కేరళలోని చన్న కుగ్రామంలో గిరిజనులపై పరిశోధన చేసినా అది ముఖ్యమేనని ఆమె అన్నారు. ఏది పనికొచ్చేది, ఏది పనికిరానిదని నిర్ణయించేది ఎవరని ప్రశ్నించారు. అంతేతప్ప ఇలా పరిమిత అంశాలపైనే పరిశోధన చేయాలంటే ఇక విద్యార్థులకు స్వేచ్ఛ ఉండదని మండిపడ్డారు.