హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలుపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సు ఛార్జీల కంటే మెట్రో ఛార్జీలు తక్కువే అని కేటీఆర్ అన్నారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రోపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. హైదరాబాద్ మెట్రో విజయవంతంగా నడుస్తోందని కేటీఆర్ తెలిపారు. ప్రారంభించిన రెండేళ్లలోనే హైదరాబాద్ మెట్రోలో రోజుకు మూడు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. చెన్నై మెట్రోలో ఇప్పటికీ 75వేల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల కంటే మెట్రో ఛార్జీలే తక్కువన్నారు. మెట్రో రైలు రాయితీ ఒప్పందంలో ఎటువంటి మార్పులేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో అన్ని మెట్రోలతో హైదరాబాద్ మెట్రోను పోల్చొద్దని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తామన్నారు. మరోవైపు పాతబస్తీకి మెట్రో సర్వీసు నడుపుతామని తేల్చిచెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై అపోహలు సృష్టించొద్దని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టుపై 370 కేసులు ఉండగా.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుని రెండేళ్లలోనే 360 కేసులు పరిష్కరించారని వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే..మెట్రో రైలులో ప్రయాణం చేయడం వల్ల తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరే వెసులుబాటు కలుగుతోంది. అంతేకాదు ట్రాఫిక్లో చిక్కుకుపోవడం లాంటి సమస్యలు కూడా ఉండవు. బస్సులో అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు, కానీ, ఛార్జీలు మాత్రం తక్కువ. బస్సు ఛార్జీల కంటే మెట్రో ఛార్జీలు ఎక్కువని సామాన్యులు అంటున్నారు. మెట్రో కనిష్ట ఛార్జీ రూ.10 కాగా, గరిష్ట ఛార్జీ రూ.60.