విజయవాడ: రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ను చంద్రబాబు నేతృత్వంలో టిడిపి బృందం కలిసింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల పాలనలో టిడిపి వర్గీయులపై జరిగిన దాడులు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు, ప్రభుత్వ వేధింపులు, టిడిపి నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు వంటి వాటిపై గవర్నర్కు నేతలు వివరించారు. 13 పేజీల వినతిపత్రం అందజేశారు.
గవర్నర్ను కలిసిన వారిలో చంద్రబాబు, నారా లోకేష్, నిమ్మకాయల చిన రాజప్ప, కింజరపు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, దేవనేని ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, బుద్దా వెంకన్న, కరణం బలరాం, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, యలమంచిలి రాజేంద్ర ప్రసాద్, అశోక్బాబు తదితర నాయకులు ఉన్నారు.
అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయని ఆరోపించారు. ఏ తప్పు చేయని కోడెలను అవమానించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే తన క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్ తీసుకువెళ్లాలని కోడెల స్పీకర్ కార్యాలయానికి లేఖ రాస్తే దానిపై ఎకనాలెడ్జిమెంట్ కూడా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. ఆ తరువాత కూడా రెండు పర్యాయాలు రాసిన లేఖలకు స్పందించకపోతే కొరియర్ ద్వారా కూడా లేఖ పంపించారని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా కోడెలపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టి వేధింపులకు గురి చేసి, ఆయన మృతికి కారణమయిందని చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రుల క్యాంప్ కార్యాలయాల్లో ఉన్న ఫర్నీచర్ చోరీ సొత్తు కింద పరిగణిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారని చంద్రబాబు అన్నారు. కోడెల కుటుంబ సభ్యులపై అధారాలు లేని పిటీ కేసులనూ నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు చేసి వేధింపులకు గురి చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను అన్ని రకాలుగా భయపెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
గవర్నర్కు చంద్రబాబు అందజేసిన లెటర్ పూర్తి పాఠం కొరకు కింద క్లిక్ చేయండి
01_Governor-Letter_19th-September