(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ రాజకీయం హీటెక్కింది. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ఎవరన్న దానిపై కాంగ్రెస్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మొదటి నుంచీ ఊహిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తమ్ స్పష్టం చేశారు. అయితే, దీనిపై పార్టీలోని ఓ వర్గం నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలతో వివాదం రాజుకుంటోంది. ఆ స్థానం అభ్యర్థిత్వంపై నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి.
తాజాగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై చేసిన కామెంట్ తో ఆపార్టీలో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. హుజూర్నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్రెడ్డిని తాను ప్రతిపాదిస్తున్నానని రేవంత్ పేర్కొనడం మరింత వేడిని రాజేసింది. అయితే దీనికి భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హుజూర్నగర్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో తమకు తెలుసని అన్నారు. ఇటీవల కాలంలో పార్టీలోకి వచ్చినవారి సలహాలు, సూచనలు తమకు అక్కరలేదని రేవంత్రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతియే సరైన అభ్యర్థి అని.. రేవంత్రెడ్డి చెప్పేపేరు తనకే కాదు.. జానారెడ్డికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. హుజూర్నగర్లో పోటీచేసేది పద్మావతియే.. గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కొన్ని అభిప్రాయబేధాలు ఉన్నది వాస్తమే అయినా.. ఇప్పుడు జానారెడ్డి, ఉత్తమ్, తాను ఒక్కటయ్యామన్నారు. కాంగ్రెస్లోని పాతతరం నేతలంతా పీసీసీ అధ్యక్షుడిగా తననే ఉండమని అంటున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
2019 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలువడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన నాటి నుంచే ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, స్థానిక నేతలు, కేడర్ అభిప్రాయం ప్రకారం ఉత్తమ్ సతీమణి పద్మావతే అక్కడ సరైన అభ్యర్థి అనే వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఉత్తమ్తో పాటు మంచి పరిచయాలున్న ఆమె అయితే టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వొచ్చని, కచ్చితంగా ఉప ఎన్నికలో గెలిచే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు తన సతీమణి ఉప ఎన్నిక బరిలో దిగుతున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో హుజూర్నగర్ స్థానం అభ్యర్థిత్వంపై నేతల మధ్య విభేదాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి.