(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైసీపీలోనే ఉంటారా? లేక బీజేపీలో చేరుతారా ? ఇప్పుడు ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు సోమవారం(జనవరి 6) ఢిల్లీలో వరుసగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలవడంతో రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్తో దగ్గరి బంధుత్వం ఉన్న ఆయన.. బీజేపీలో చేరతారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడు అయిన సినీనటుడు మోహన్ బాబు… ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు రాజకీయాలపై వ్యాఖ్యలు చేసినా… ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు కుటుంబం… వైసీపీ గెలుపు కోసం ప్రచారం కూడా చేసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం మోహన్ బాబుకు సీఎం జగన్ కీలక పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందనే వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని మోహన్ బాబు స్వయంగా వివరణ ఇచ్చారు. ఆ తరువాత ఆయనకు ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ పదవిని వైసీపీలో కొనసాగుతున్న మరో నటుడు విజయ్ చందర్కు ఇచ్చారు. దీంతో సీఎం జగన్ మోహన్ బాబుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం(జనవరి 6) మోహన్ బాబు ప్రధాని నరేంద్రమోదీని కలవడంతో ఆయన ఫ్యామిలీ బీజేపీలో చేరబోతోందనే వార్తలు ఇంకా ఎక్కువ అయ్యాయి.
అయితే, మోదీ, అమిత్ షాలను కలవడంపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు. ప్రధానితో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదన్న ఆయన.. తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థలను సందర్శించాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. మిమ్మల్ని ప్రధాని మోదీ బీజేపీలోకి ఆహ్వానించారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మోహన్ బాబు నవ్వుతూ సమాధానం దాటేశారు. ప్రధానితో భేటీ అనంతరం.. వాట్ ఏ మ్యాన్ అని మోహన్ బాబు ట్వీట్ చేయగా.. ప్రధాని మోదీ బదులిస్తూ.. మోహన్ బాబూ.. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను కలవడం ఆనందంగా ఉందన్నారు. సినిమా రంగ ప్రాధాన్యం సహా అనేక అంశాల గురించి తాము చర్చించామని ప్రధాని తెలిపారు. ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలను ఎలా బలోపేతం చేయగలమో చర్చించామన్నారు. దీంతో మోహన్ బాబు ఇప్పుడు కాకపోయిన తర్వలోనే కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం ఊపందుకుంది.
It was a delight to meet your family and you, @themohanbabu.
We had very good discussions on many issues including the importance of cinema and how we can deepen cultural linkages between people. https://t.co/hCmcGumRyy pic.twitter.com/5jH0wQnlmb
— Narendra Modi (@narendramodi) January 6, 2020
మరోవైపు మోమన్ బాబుకు రాజ్యసభ పదవి ఇస్తారనే వార్తలు వినిపించాయి. ఏపీలో నాలుగు ఖాళీ అవుతున్నాయి. వైసీపీకి దక్కబోయే నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి తనకు దక్కుతుందని మోహన్ బాబు ఆశించారని… కానీ ఇందుకు వైసీపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడం వల్లే ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సొంత అన్నదమ్ములే వేర్వేరు పార్టీలో కొనసాగుతున్న రాజకీయ నాయకులను చూస్తున్నాం. అలాంటిది ఏపీ సీఎం జగన్తో దగ్గరి బంధుత్వం ఉన్న మోహన్ బాబు కుటుంబం… నిజంగానే వైసీపీని వీడి బీజేపీలోకి వెళ్లడంతో అశ్చర్యం లేదనే టాక్ వినపిస్తోంది. మొత్తానికి మంచు ఫ్యామిలీ బీజేపీలో వెళుతుందా ? లేదా ? అన్నది కాలమే చెప్పాలి.