న్యూఢిల్లీ: పదిహేడవ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు కూడా ఆయన నామినేషన్ను సమర్ధించడంతో ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమయింది. ఓం బిర్లా నామినేషన్ను ప్రతిపాదించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను స్వయంగా స్పీకర్ స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు.
ఓం బిర్లా రాజకీయాల లక్ష్యం ప్రజాసేవ, ఆయన దయార్ద్ర దృక్ఫధంతో సభను నడుపుతారు అని మోదీ పేర్కొన్నారు. మీరు నిర్వహించిన కార్యక్రమాలు, పార్లమెంటేరియన్గా జాతి ప్రయోజనాల కోసం మీరు అంకితమైన తీరు శ్లాఘనీయం అని కొత్త స్పీకర్ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.
లోక్సభలో కాంగ్రెస్ నేతగా ఎన్నికయిన ఆధీర్ రంజన్ చౌదరి స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడుతూ, సభాపతిగా లోక్సభ ప్రతిష్టను కాపాడే బాధ్యత మీదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతికూల రాజకీయాలు నడపదని ఆయన హామీ ఇచ్చారు.
రాజస్థాన్లోని కోట నియోజకవర్గం నుంచి మూడు సార్లు లోక్సభకు ఎన్నికయిన 56 ఏళ్ల ఓం బిర్లా బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు సన్నిహితుడు. ఆయన ఆరెస్సెస్ నేపధ్యం నుంచి పార్లమెంట్కు వచ్చారు.