(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్వాససంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు ఆరాటపడుతున్నారు. అయితే, కొందరు వ్యాపారులు స్వచ్ఛమైన గాలిని అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఢిల్లీలో ‘ప్యూర్ ఆక్సిజన్’ పేరిట కొన్ని ఆక్సిజన్ సెంటర్లు వెలిశాయి. ఇకపై స్వచ్ఛమైన గాలి కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, మాములు షాపింగ్ కు వెళ్లినట్టు వెళ్లి.. స్వచ్ఛమైన ఆక్సిజన్ ను హాయిగా పీల్చుకొని రావచ్చట. కేవలం రూ.299 చెల్లించండి.. 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోండి అంటూ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీలోని సాకేత్లో సిటీ వాక్ మాల్ లో ఓ ఆక్సిజన్ బార్ను ఏర్పాటు చేశారు. అక్కడ ‘ప్యూర్ ఆక్సిజన్’ ను వివిధ ఫ్లేవర్స్ తో మిక్స్ చేసి అమ్ముతురున్నారు. సుగంధ ద్రవ్యాల సువాసనల్లో 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన ప్రాణ వాయువును ఆస్వాదించవచ్చని సంస్థ నిర్వహకులు చేప్తున్నారు. స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. లెమన్ గ్రాస్, దాల్చిన చెక్క, పుదీనా, లావెండర్, వెనీలా, యూకలిప్టస్, బాదం, చెర్రీ వంటి వివిధ రకాల పరిమళాల్లో ఆక్సిజన్ అందిస్తున్నామని చెప్పారు. వినియోగదారులు ట్యూబ్ ద్వారా గాలి పీల్చుకోవచ్చని బార్ నిర్వాహకులు తెలిపారు.
వినియోగదారులకు ఓ తేలికపాటి గొట్టం ఇస్తారు. దీని సాయంతో ఆక్సిజన్ తీసుకోవాలి. ఈ పరికం కస్టమర్ ముక్కు దగ్గర పెడతారు. దీని ద్వారా వారు సుగంధ ద్రవ్యాల ఆక్సిజన్ ను పీల్చకోవాలి. ఒక వ్యక్తి రోజులో ఒకసారి మాత్రమే ఆక్సిజన్ పీల్చే అవకాశం ఉంటుంది. రోజుకు ఒకసారి స్వచ్ఛమైన గాలి పీలిస్తే.. శరీరం ఉత్తేజితమవుతుందని నిర్వహకులు తెలిపారు. ఈ ఆక్సిజన్ బార్లకు వినియోగదారుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ ఆక్సిజన్ పీల్చడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంది, మంచి నిద్ర పడుతుందని వినియోగదారులు అంటున్నారు.
ఢిల్లీలో పొల్యూషన్ తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. గాలిలో విషవాయులు ఎక్కువగా ఉంటున్నాయని, ఈ పొల్యూషన్ ఇలానే పెరిగితే.. ఢిల్లీలో మనిషి బ్రతకడం కష్టం అవుతుందని సాక్షాత్తు సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఈ కాలుష్యం కారణంగా ప్రజలు తమ అమూల్యమైన జీవన కాలాన్ని కోల్పోతున్నారని, ఈ విధమైన వాతావరణంలో మనం బతకగలుగుతామా ? అని న్యాయ మూర్తులు అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్.. అధికారులను ప్రశ్నించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. దీంతో స్కూళ్లను కూడా ఢిల్లీ ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. బయటకు ఎవరు రావాలన్నా భయపడిపోతున్నారు. మొఖానికి మాస్క్ లేకుండా.. రోడ్డు మీద అడుగు పెట్టడం లేదు. అయితే.. దీన్ని క్యాష్ చేసుకుంటారు కొందరు వ్యాపారులు. స్వచ్ఛమైన గాలిని అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.