అమరావతి: ఏపీలో ఇసుక సంక్షోభంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టనున్న ‘లాంగ్ మార్చ్’ కార్యక్రమంపై సర్వత్ర టెన్షన్ నెలకొంది. ఇసుక కొరత కారణంగా భనవ నిర్మాణ కార్మికులకు అండగా ఉండేందుకు విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ‘లాంగ్ మార్చ్’ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మద్దిలపాలెం జంక్షన్లోని తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు సాగనుంది. ‘లాంగ్ మార్చ్’కు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. నిరసన ర్యాలీకి అనుమతి లేందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మార్చ్ను భగ్నం చేసేందుకు కొంత మంది చేసిన కుట్రగా ఆయన అభివర్ణించారు. ప్రకటించిన సమయానికి మార్చ్ నిర్వాహిస్తున్నామని స్పష్టం చేశారు. కార్యకర్తలు అంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. పోలీసులు అనుమతి ఇచ్చిన ఆర్డర్ కాపీని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. విశాఖలో మద్దిలపాలెం జంక్షన్లోని తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహిస్తామని పవన్ తెలిపారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది కార్మికులకు అండగా ఉంటామని చెపారు.
Permission given by Visakhapatnam Police for ‘ Long March’ on 3rd Nov 2019 to highlight the woes of 3.5 million construction workers & I appeal to Party leaders,cadre, supporters & Janasainiks not to fall for false news getting circulated by YCP Govt that there is no permission. pic.twitter.com/LYNlcIoZNJ
— Pawan Kalyan (@PawanKalyan) November 2, 2019
‘లాంగ్ మార్చ్’ లో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలకు కోరారు. ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో 30 లక్షల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వారి పక్షాన పోరాడతామని అందుకు అంతా సహకరించాలని తెలిపారు. అయితే పవన్ కు టీడీపీ మద్దతు ప్రకటించగా.. వామపక్ష పార్టీలు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నాయి. శనివారం పవన్ కల్యాణ్ కు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధులు స్వయంగా లేఖ రాశారు. లాంగ్ మార్చ్ లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. లాంగ్ మార్చ్ కి తమతోపాటు బీజేపీని కూడా ఆహ్వానించడంతో తాము దూరం కావాల్సి వస్తుందని తెలిపారు. ఇసుక సమస్యపై ఇప్పటికే సీపీఐ, సీపీఎం పార్టీలు… వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాయన్నారు. పవన్ ఈ విషయాన్ని గమనించారని భావిస్తున్నామని రామకృష్ణ, మధు పేర్కొన్నారు.
ప్రస్తుతానికి పవన్ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే బహిరంగంగా మద్దతు తెలిపింది. పార్టీ తరపున సీనియర్ నేతలు పాల్గొంటారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్ లో ఏఎలాంటి పిలుపు ఇచ్చినా తాము మద్దతు ఇస్తామంటూ చంద్రబాబు స్నేహ హస్తం అందించారు.
ఇకపోతే పవన్ లాంగ్ మార్చ్ ఆహ్వానంపై బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. తొలుత పవన్ లాంగ్ మార్చ్ వేదికను తాము పంచుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైతం పవన్ తో వేదికను పంచుకోబోమని తెలిపారు. అయితే శుక్రవారం కన్నా లక్ష్మీనారాయణ మాట మార్చారు. పవన్ లాంగ్ మార్చ్ కు బీజేపీ సంఘీభావం తెలుపుతుందని తెలిపారు. అయితే విష్ణువర్థన్ రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. దాంతో బీజేపీ గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలో లాంగ్ మార్చ్ పై సర్వత్రా టెన్షన్ నెలకొంది.