కొట్టే ప్రతివాడు పోలీసు కాదు. ప్రతి పోలీసోడు కొట్టడు…! పోలీసులు కొడుతున్నారని వారిలో కర్కోటకులను వెతుకుతున్న మనమే వారిలో మానవత్వాన్ని చూస్తున్నాం. అడపాదడపా పోలీసులు తమ మంచి మనసుని చాటుకుంటున్నారు. కానీ వీరిలో కొందరుంటారు.., ఎవరికీ అందరు. వారి కథలుంటాయి చరిత్రలో అరుదుగా, ఆదర్శంగా నిలిచిపోతాయి. మనం ఇప్పుడు చెప్పుకునేవి అటువంటి రెండు కథలే. అటువంటి ఇద్దరు పోలీసుల గురించే. మన పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడులో జరిగిన ఘటనలు తెలుసుకోవాల్సిందే…!
850 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించి మందులు అందజేత…!
సొంత మనుషులకు సుస్తీ చేస్తే మూడు, నాలుగు కిలోమీటర్లు వెళ్ళడానికే వాయిదా వేసుకుంటూ వేరే వారికి అప్పగిస్తాం. అటువంటిది బెంగుళూరు మునిసిపల్ పోలీస్ కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామి అపరిచిత రోగికి మందులు ఇవ్వడానికి 850 కిలోమీటర్లు ప్రయాణించారు. కుమారస్వామి అనే హెడ్ కానిస్టేబుల్ బెంగుళూరులో విధులు నిర్వర్తిస్తుంటారు. ఒక కాన్సర్ రోగికి మందులు అవసరమని న్యూస్ ఛానల్ ద్వారా విన్నారు. ఈయన వెంటనే న్యూస్ ఛానెల్తో సంప్రదింపులు జరిపి ఆ రోగికి సహాయం చేస్తానన్నాడు. బెంగళూరులోని డిఎస్ రీసెర్చ్ సెంటర్తో మాట్లాడారు. ధార్వాడ్లోని గుర్తుతెలియని రోగికి మందులు పంపిణీ చేయడానికి అవసరమైన మందులు మరియు అనుమతులను ఏర్పాటు చేశారు. ఈయన బెంగుళూరు నుండి తెల్లవారుజామున 4:00 గంటలకు ప్రారంభించి, కేవలం 14 గంటలలోనే గమ్యానికి చేరుకున్నారు. బెంగుళూరు నుండి ధార్వాడ్ సుమారుగా 425 కిలోమీటర్లు ఉంటుంది. సకాలంలో మందులను అందించి తిరిగి తన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ మొత్తం ప్రయాణానికి ఆయనకు 24 గంటలు పట్టింది. ఆ పోలీస్ అధికారి ప్రయాణించిన దూరం మొత్తం సుమారు 850 కిలోమీటర్లు. హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామి చేసిన ఈ చర్యకు కర్ణాటక పోలీస్ డిపార్టుమెంటులో, మరియు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అతని ప్రశంసించారు. ఇది ఆ రాష్ట్రంలో పోలీసు శాఖకు విజయంగా మిగిలింది.
విధులు పూర్తయ్యాక… గర్భవతికి రక్తదానం…!
ఇది మరో కథ. గర్భవతికి రక్తదానం చేసి తల్లి, బిడ్డను కాపాడిన పోలీసు కథ. తమిళనాడులో జరిగింది. “సులోచన, వయసు 24 సంవత్సరాలు. గర్భవతి. తమిళనాడు, తిరుచిరాపల్లి జిల్లా రెట్టియపట్టి గ్రామం. నొప్పులు రావడంతో, భర్త మరో బంధువుతో కలిసి తమ గ్రామం నుండీ 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనప్పరాయ్ లోని ఆస్పత్రికి అంబులెన్స్ లో వెళ్ళారు. సిజేరియన్ చేయించుకుంటే బెటర్ అని అక్కడి డాక్టర్లు సలహా ఇచ్చారు. కాకపోతే, సిజేరియన్ సమయంలో రక్తం ఎక్కించాల్సి ఉంటుందనీ, లాక్ డౌన్ వల్ల ఆస్పత్రిలో రక్తం అందుబాటులో లేదనీ, డోనర్ ని తీసుకుని రావాలని , లేకపోతే, ఊరికి వెళ్ళి, నాలుగురోజుల తర్వాత తిరిగి రావల్సిందిగా డాక్టర్లు సూచించారు. వారు తిరుగు ప్రయాణానికి రోడ్డుపై వేచి చూస్తుండగా… రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అబుల్తా తాహిర్ అనే కానిస్టేబుల్ ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారని వారిని ఆపి అడిగాడు. ఆస్పత్రి నుండీ తమ గ్రామానికి వెళ్తున్నామని వారు చెప్పడంతో, వారికి ట్యాక్సీ ని అరేంజ్ చేశాడు. ఇంతలో అనుమానమొచ్చి, నెలలు నిండినతర్వాత, ఆసుపత్రికి కాకుండా, ఇంటికెందుకు వెళ్తునారని అడిగాడు. రక్తం దొరకకపోవడం వల్ల అని తెలియడంతో, కావలసిన బ్లడ్ గ్రూప్ ఏదో కనుక్కుని, వారిని తన డ్యూటీ ఐపోయే టైమ్ వరకూ అక్కడే వెయిట్ చేయమన్నాడు. ఈ లోపలే ముగ్గురికీ భోజనం కూడా తెప్పించాడు. మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగించుకుని, వారిని నేరుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళి, తానే రక్తదానం చేశాడు. రాత్రి పది గంటలకు ఆడ పిల్ల పుట్టింది. పాపను చూసి, ఆ తర్వాతే ఇంటికెళ్ళాడు. తెల్లారేకల్లా , ఈ విషయం వార్తగా వ్యాపించింది. ఆ కానిస్టేబుల్ కి రాష్ట్ర అధికారుల నుండి ప్రశంసలు దక్కాయి.