న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్, జెడిఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ రాజీనామాలను ఆమోదించకుండా కావాలనే స్పీకర్ జాప్యం చేస్తున్నారని అసమ్మతి ఎమ్మెల్యేల ఆరోపిస్తున్నారు. తమ రాజీనామాలను స్పీకర్ వెంటనే ఆమోదించేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరారు.
కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో పాలన గాడి తప్పిందనీ, అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఎమ్మెల్యేలు పిటిషన్లో ఆరోపించారు. పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ హోహత్గీ ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై రేపు విచారణ చేపట్టనుంది.
కాంగ్రెస్,జెడిఎస్ కూటమి ఎమ్మెల్యేలు 13మంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ముంబయిలోని ఒక హోటల్లో బస చేశారు.
అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించని స్పీకర్ రమేష్ కుమార్ మరో రోజు వచ్చి సహేతుకమైన వివరణతో రాజీమానాలు ఇవ్వాలని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వీరు నేడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.