పుణె: ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో కరెంటు లేకుండా ఒక్క గంట అయినా ఉండగలమా? కానీ పుణెలోని బుధవారపేటలో నివసిస్తున్న రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ హేమా సానే (79) జీవితాంతం కరెంటు లేకుండానే గడిపేస్తున్నారు. ప్రకృతి, పర్యావరణం అంటే ప్రేమతో ఆమె కరెంటు వద్దనుకున్నారు. ‘‘మనిషికి ఆహారం, గూడు, దుస్తులు ప్రాథమికావసరాలు. ఒకప్పుడు కరెంటు లేనే లేదు. ఎప్పుడో వచ్చింది. అది లేకపోయినా నాకు పర్వాలేదు’’ అని ఆమె చెప్పారు.
తన ఆస్తి మొత్తం తన పెంపుడు కుక్క, రెండు పిల్లులు, ఒక ముంగిస, బోలెడు పక్షులకు చెందుతుందని డాక్టర్ హేమ చెప్పారు. అది వాటి ఆస్తే తప్ప తనది కాదని, తాను కేవలం సంరక్షకురాలిగానే ఉన్నానని అన్నారు. చాలామంది తనను మూర్ఖురాలంటారని, తాను అమాయకురాలిని కావచ్చని, కానీ తాను మాత్రం తనకు కావల్సినట్లుగా జీవిస్తానని తెలిపారు. డాక్టర్ హేమ గతంలో సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీ నుంచి బోటనీలో పీహెచ్ డీ చేశారు. పలు సంవత్సరాల పాటు గర్వారే కాలేజిలో ప్రొఫెసరుగా పనిచేశారు. ఆమె చిన్న ఇంట్లో నివసిస్తారు. ఇంటిచుట్టూ పలు రకాల చెట్లు, పక్షులు ఉంటాయి. ఉదయాన్నే పక్షుల కువకువలతో నిద్రలేస్తారు. ఆమె బోటనీ, పర్యావరణం మీద అనేక పుస్తకాలు రాశారు. ఇప్పుడు కూడా ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏదో ఒకటి రాస్తుంటారు. ఆమెకు తెలియని పక్షి, చెట్టు దాదాపు లేవు.
‘‘నా జీవితంలో కరెంటు అవసరం నాకు కనిపించలేదు. నన్ను చాలామంది కరెంటు లేకుండా ఎలా బతుకుతారంటారు. నేను వారిని కరెంటుతో ఎలా బతుకుతారని అడుగుతాను. ఈ పక్షులే నా స్నేహితులు. నేను ఇంట్లో పనిచేసుకుంటుంటే అవి వచ్చేస్తాయి. ఇల్లు అమ్మేస్తే చాలా డబ్బు వస్తుందని అందరూ అంటారు. అప్పుడీ చెట్లు, పక్షులను చూసుకునేదెవరు? నేను బయటకు వెళ్లను.. వాటితోనే ఉంటా’’ అని చెప్పారు.