ఆ డబ్బంతా దానమే: ఆదాయపన్ను శాఖ
బెంగళూరు: కాలం కలిసొస్తే ఇలాగే ఉంటుందేమో. బెంగళూరుకు చెందిన ఓ ఆటో్డ్రైవర్ ఇటీవల రూ. 1.6 కోట్లు పెట్టి వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని ఖరీదైన గేటెడ్ సొసైటీలో విల్లా కొన్నారు. ఆ ఇల్లు కొనడానికి డబ్బంతా దానం రూపంలోనే వచ్చిందని ఆదాయపన్ను శాఖ నిర్ధరించింది. నల్లురల్లి సుబ్రమణి (37) అనే ఆటో డ్రైవరుకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయా అని ఆదాయ పన్ను శాఖ అధికారులు అనుమానించారు. అయితే, ప్రయాణికులలో ఒకరు పుణ్యం కట్టుకోవడం వల్లే ఇదంతా వచ్చిందని సుబ్రమణి చెప్పారు.
బినామీ లావాదేవీల నిషేధ చట్టం కింద అతడికి నోటీసు ఇచ్చి, ఐటీ అధికారులు విచారణ చేశారు. మహదేవపుర ప్రాంతంలోని జట్టి ద్వారకామాయి కాలనీలో గల ఆ సొసైటీ డెవలపర్ ను కూడా ప్రశ్నించారు. సుబ్రమణితో సంబంధాలు ఉన్నాయేమోనని కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అరవింద్ లింబవల్లిని కూడా అనుమానించారు. అయితే, చాలాకాలం క్రితం ఒక బహిరంగ సభలో సుబ్రమణి పాల్గొన్నాడు తప్ప అతడితో తనకేమీ సంబంధం లేదన్నారు. ఆరోపణలన్నీ అవాస్తవమని, నిరాధారమని చెప్పారు.
అమెరికాకు చెందిన లారా ఎవిసన్ (72) అనే మహిళ సుబ్రమణికి ఆ డబ్బులను విరాళంగా ఇచ్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఐటీ అధికారులు తెలిపారు. 2006 సంవత్సరంలో ఆమె నగరంలో తిరిగేందుకు సుబ్రమణి సాయం చేశారు. అతడి కష్టాల గురించి తెలిసిన ఆమె.. పిల్లల చదువుకు సాయం చేద్దామని అనుకున్నారు. తర్వాత విల్లా కొనుగోలుకు కూడా డబ్బులు ఇచ్చారు. ఎవిసన్, సుబ్రమణి చెప్పిన విషయాలు సరిపోలాయని, ఇద్దరూ తగిన పత్రాలు కూడా చూపించారని అధికారులు తెలిపారు.