న్యూఢిల్లీ: క్రికెట్ వదిలి రాజకీయాల్లోకి వచ్చిన డాషింగ్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్.. ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. 15 ఏళ్లు క్రికెట్ రంగంలో ఉన్నా లేనన్ని ఆరోపణలు కేవలం 15 గంటల రాజకీయాల్లో వచ్చాయని ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ‘‘కొన్నిసార్లు ఆప్ వాళ్లు నా నామినేషన్ రద్దు చేయిస్తామంటారు, కొన్నిసార్లు నాకు రెండు ఓటరు కార్డులున్నాయంటారు, ఇప్పుడేమో నేను ఏడాదికి 240 రోజులు విదేశాల్లో ఉంటానని కేజ్రీవాల్ చెబుతారు’’ అని గంభీర్ అన్నాడు. అంతర్జాతీయ ఒప్పందాలున్న మాజీ క్రికెటర్ కంటే సేవ చేసేవాళ్లను ఎన్నుకోవాలని కేజ్రీవాల్ ప్రచారంలో చెప్పడంతో గంభీర్ స్పందించాడు.
కాంగ్రెస్ నేత అర్వీందర్ సింగ్ లవ్లీ, ఆప్ అభ్యర్థి అతిషిలను గంభీర్ ఎదుర్కొంటున్నాడు. ఈ ముగ్గురిలో లవ్లీ ఒక్కరికే రాజకీయాల్లో అనుభవం ఉంది. అతిషి కూడా రాజకీయాలకు కొత్తే అయినా, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు సలహాదారుగా ఉండేవారు. నగరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల పెంపునకు పనిచేశారు. గతంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన ఆమె.. గంభీర్ నామినేషన్ వేసినప్పటి నుంచి విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాము బహిరంగ చర్చకు పిలిస్తే గంభీర్ పారిపోయాడని ఆప్ ఎద్దేవా చేయగా, దానికి గంభీర్ దీటుగా సమాధానమిచ్చారు. ‘‘పాకిస్థాన్ అంటేనే భయపడని నేను.. మీ చర్చకు భయపడటానికి కారణం ఏముంది’’ అని ప్రశ్నించాడు. కేజ్రీవాల్ ను చర్చకు రావాలని తాను సవాలు చేసినట్లు ప్రజలకు చెప్పారు. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో సగం సమయం తనకివ్వాలని, ఆ తర్వాత స్థలం.. సమయం చెబితే చర్చకు వస్తానని గంభీర్ చెప్పాడు.
కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయితే తాను కేవలం కొన్ని రోజుల క్రితమే వచ్చానని గుర్తుచేశాడు. తనకు ఇంకా కేజ్రీవాల్ నుంచి సమాధానం రాలేదని అన్నాడు. ఆయనెప్పుడూ ‘డిబేట్, ధర్నా, డ్రామా’ల వెనకే ఉంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక.. ఢిల్లీకి రాష్ట్ర హోదా అడుగుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎప్పుడూ ఆప్ లా తప్పుడు హామీలు ఇవ్వదని చెప్పారు.