దేశ వ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదితో ముగియనుంది. లాక్ డౌన్ ఆంక్షలను క్రమం క్రమంగా సడలిస్తున్న కేంద్రం పలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మే 18వ తేదీ నుండి ప్రజా రవాణా పునరుద్దరణతో పాటు సినిమా హాల్స్, మాల్స్ ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వబోతున్నదని ప్రచారం జరుగుతున్నది. కరోనాను ఎదుర్కొనేందుకు నెలన్నర రోజులుగా ప్రజలను ఇళ్లలోనే బందీ చేసిన కేంద్రం అన్నీ అనుకున్నట్లు జరిగితే మరిన్ని సడలింపులను ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. కరోనా కేసుల పరంగా రెడ్, అరేంజ్, గ్రీన్ జోన్ లుగా కేటగిరైజ్ చేసిన నేపథ్యంలో రెడ్ జోన్ ఏరియాలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తూనే ఆరెంజ్, గ్రీన్ జోన్ ఏరియాలో మరిన్ని సడలింపులు ఇస్తుందని భావిస్తున్నారు. మే 17వ తేదీ తరువాత ఏమి చేయాలన్న దానిపై కేంద్రం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోందని, అయితే సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా అమలు చేయడం, ప్రజలు విధిగా మాస్క్ లు ధరించేలా చూడటం వంటి చర్యలతో లాక్ డౌన్ సడలింపులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
18వ తేది నుంచి కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎపిలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు యాజమాన్యం సిద్దమవుతున్నది. ఈ క్రమంలోనే ఏపీఎస్ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. అందు కోసం అధికారులు కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. బస్సులను అంతర్ జిల్లా సర్వీస్ లు గానే నడపాలని భావిస్తున్నారు. ఎపిలో మాత్రమే బస్సులు తిరగనున్నాయి. బస్సులలో 50 శాతం సీట్లలో మాత్రమే ప్రయాణీకులను అనుమతిస్తారు. సిటీ బస్సులకు సైతం ఇదే నిబంధన వర్తింప చేయనున్నారు. ఇక కరోనా నేపథ్యంలో కొద్ది రోజులు కండక్టర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని నిర్ణయించింది. బస్సులో ప్రయాణికుల మధ్య తిరుగుతూ కండక్టర్లు బస్ టిక్కెట్లు ఇస్తే కరోనా వ్యాప్తికి అవకాశం ఉంటుందని భావించిన అధికారులు ప్రయాణికులు ఆన్లైన్లో, కరెంట్ రిజర్వేషన్, బస్టాండ్లు, బస్టాపుల్లో సిబ్బంది విక్రయించే టిక్కెట్లను కొని బస్సు ఎక్కాల్సి ఉంటుంది. ఇక, నాన్ ఏసీ బస్సుల విషయానికి వస్తే 150 కి.మీ.కుపైన దూరం వెళ్లే బస్సులకు అయిదు స్టాప్లు మాత్రమే ఉండాలి. అది కూడా ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. ఇక 150 కిలో మీటర్ల లోపు బస్సు సర్వీసులు అయితే ఆర్టీసీ నిర్దేశించిన కౌంటర్లలో టిక్కెట్లు తీసుకోవాలి. నాన్ స్టాప్ బస్సులకు కూడా ఇక ఆన్లైన్ రిజర్వేషన్లు ఉంటాయి. పల్లె వెలుగు బస్సులకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రయాణికులు బస్టాండ్లు, ఆర్టీసీ సిబ్బంది, బుకింగ్ ఏజెంట్ల దగ్గర టిక్కెట్లు తీసుకోవాలి. బస్టాండుల్లో టిక్కెట్ల కోసం గ్రౌండ్ బుకింగ్ సాప్ట్వేర్తో టిమ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తారు. సిటీ బస్సుల్లో సైతం కండక్టర్లు లేకుండా కొన్ని స్టాపుల్లో టిక్కెట్లు తీసుకోవాలి. బస్సుల డోర్లకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అన్ని డిపోల మేనేజర్లకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కేసులకు భయపడి లాక్ డౌన్ పొడిగిస్తూ పొతే ఆర్ధిక వ్యవస్థ మరింతగా దిగజారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కరోనా కట్టడికి అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలు కఠిన తరంగా అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని యోచనలో ప్రభుత్వాలు కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయి.