కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్ ప్రమోద్ చంద్ర త్యాగి
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఒక సున్నితమైన కేసును వదిలేయాల్సిందిగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ తనపై తీవ్రమైన వత్తిడి తెచ్చారని ఆదాయం పన్నుశాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్కు పంపిన ఫిర్యాదులో ఆరోపించారు. జూన్ 21న అల్కా త్యాగి ఈ ఫిర్యాదు పంపినపుడు ఆమె ఆదాయం పన్ను శాఖ ముంబై (యూనిట్ 2) చీఫ్ కమిషనర్గా పని చేస్తున్నారు.
తొమ్మిది పేజీల త్యాగి ఫిర్యాదులోని అంశాలను ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వెల్లడించింది. అదే విషయంపై ఆమె ప్రధానమంత్రి కార్యాలయానికీ, కేంద్ర విజిలెన్స్ కమిషన్కూ, కాబినెట్ సెక్రటరీకి కూడా ఫిర్యాదు చేశారని ఆ పత్రిక తెలిపింది. ఒక ప్రతిపక్ష నేతపై సోదా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందువల్లనే తాను ఈ ఉన్నతస్థాయి పదవిలోకి రాగలిగానని మోదీ చెప్పినట్లు త్యాగి తన ఫిర్యాదులో రాశారు.
అప్పట్లో త్యాగి దర్యాప్తు చేస్తున్న వాటిల్లో దీపక్ కొచ్చార్ – ఐసిఐసిఐ బ్యాంక్ కేసు, నల్లధనం అభియోగాలపై ముఖేష్ అంబానీ కుటుంబసభ్యులకు నోటీసులు ఇచ్చిన కేసు, జెట్ ఎయిర్ వేస్ కేసు, మరికొన్ని ముఖ్యమైన సోదా కేసులు ఉన్నాయి. అదాయం పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పదవికి ప్రమోషన్ పొందాల్సిన త్యాగిని గురువారం నాడు జాతీయ ప్రత్యక్ష పన్నుల అకాడెమీకి ప్రిన్సిపల్ డైరక్టర్ (శిక్షణ)గా బదిలీ చేశారు.
చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్న ఒక సున్నితమైన కేసు ఫైలు మూసేయాల్సిందిగా మోదీ తనపై భయంకరమైన వత్తిడి తెచ్చారనీ, అయితే ఇందులో ఎక్కడా తన పేరు కనబడడానికి వీల్లేదని ఆదేశించారనీ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తనపై జరిగిన విజిలెన్స్ విచారణను తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు మోదీ వాడుకున్నారని కూడా ఆమె ఆరోపించారు.
ఏదైనా కేసులో ఒకసారి నోటీసులు ఫైలు అయిన తర్వాత ఆ కేసు దర్యాప్తు తప్పనిసరి అనీ, మధ్యలో వదిలేస్తే సంబంధిత అధికారులు బలయిపోతారనీ ఆమె పేర్కొన్నారు. తన మాట వినని అధికారులపై ఫిర్యాదులు సృష్టించడం కూడా మోదీకి అలవాటేనని ఆమె పేర్కొన్నారు.