న్యూఢిల్లీ కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై బుధవారం నిర్ణయం వెలువరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. 15 మంది కర్నాటక తిరుగుబాటు శాసనసభ్యులు దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ కొనసాగించింది.
ముఖ్యమంత్రి కుమారస్వామి తరపున వాదించిన సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధావన్, ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు తిరుగుబాటు శాసనసభ్యులు కలిసికట్టుగా వేటాడుతున్నారని వ్యాఖ్యానించారు. వారు కలిసికట్టుగా వేటాడుతున్న విషయాన్ని స్పీకర్ పట్టించుకోవాలి. వారు అందరూ కలిసి ముంబై హోటల్కు వెళ్లారు. వారిలో ప్రతి ఒక్కరూ మంత్రి కావాలనుకునేవారే. ఇది స్పీకర్కూ, కోర్టుకూ మధ్య వ్యవహారం కాదు. ఇది ముఖ్యమంత్రికీ, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న మరో వ్యక్తికీ మధ్య వ్యవహారం అన్నారు రాజీవ్ ధావన్… తనకు అందిన రాజీనామాలు స్వచ్ఛందంగా వచ్చాయా, అవి సరైనవేనా అని విచారించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని ఆయన అన్నారు.
శాసనసభ్యుల రాజీనామాలపై సుప్రీంకోర్టు విధించిన యధాస్థితి ఉత్తర్వులను తొలగించాల్సిందిగా స్పీకర్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరారు. బుధవారంలోగా రాజీనామాలపై కర్నాటక స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.
శాసనసభ్యుల తరపున వాదన కొనసాగించిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ – జెడిఎస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఆయన అన్నారు. ఆ ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు స్పీకర్ కావాలనే రాజీనామాలపై నిర్ణయాన్ని ప్రకటించడం లేదని ఆయన అన్నారు. ఒక సభ్యుడిపై అనర్హత పిటిషన్ విచారణలో ఉన్నప్పటికీ రాజీనామా చేసేందుకు ఆ సభ్యుడికి హక్కు ఉంటుందని ఆయన అన్నారు.
శాసనసభ్యులు సభకు హాజరు కాకూడదనుకుంటే వారిని బలవంతపెట్టవచ్చా అని రోహత్గీ ప్రశ్నించారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనీ, శాసనసభ్యులు సభకు హాజరయి తమకు ఇష్టంలేని గ్రూప్ తరపున మాట్లాడేలా వత్తిడి తెస్తున్నారనీ ఆయన ఆరోపించారు.
రెబెల్ శాసనసభ్యుల రాజీనామాలు ఆమోదించినట్లయితే అసెంబ్లీలో అధికార సంకీర్ణం బలం 100కు పడిపోతుంది. అప్పుడు సభలో మెజారిటీకి ఉండాల్సిన సభ్యుల సంఖ్య కూడా 113 నుంచి 105కు దిగుతుంది. బిజెపికి ఉన్న 105 మంది సభ్యుల బలంతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి ఇబ్బంది ఉండదు.
ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమేనని ప్రకటించారు. దానికి స్పందించిన స్పీకర్ గురువారం సభలో విశ్వాసపరీక్ష జరుగుతుందని ప్రకటించారు.