సార్వత్రిక ఎన్నికల రెండవ విడత ప్రచారం ముగుస్తున్న సమయంలో నేతల ఇళ్లలో ఐటీ అధికారుల తనిఖీలు కలకలం సృష్టిస్తున్నాయి.
కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మంత్రులు, కీలక నేతల ఇళ్లే లక్ష్యంగా ఐటి సోదాలు జరుగుతున్నాయి.
నేటితో కర్నాటక, తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ప్రచారం ముగుస్తున్న తరుణంలో ఓటర్లను ప్రలోభాలకు గురు చేసేందుకు నాయకులు భారీగా డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారన్న సమాచారంతో ఐటి అధికారులు సోదాలు చేపట్టారు.
మాండ్య, హసన్ నియోజకవర్గాలలోని నేతల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటి అధికారుల తనిఖీల్లో కోట్ల రూపాయలు పట్టుబడినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో నేటి ఉదయం నుండి ఐటి దాడులు కొనసాగిస్తుండగా చెన్నైలో అర్థరాత్రి నుండి మంత్రులు రాధాకృష్ణ, ఉదయ్కుమార్ తదితర కీలక నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.
పలువురు డిఎంకె, అన్నా డిఎంకె నేతల ఇళ్లల్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే తమిళనాడులోని వేలూరు లోక్సభ ఎన్నిక రద్దు చేయాలని ఈసి నిర్ణయించుకుంది. వేలూరులో డిఎంకె అభ్యర్థి కతియార్ అనంద్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయలు ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి అనంద్పై కేసు కూడా నమోదు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నిక వాయిదాకు ఈసి నిర్ణయం తీసుకుని నివేదికను రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం.