(ఫైల్ ఫోటో)
హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం ఆయన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ గోదావరి – కృష్ణా నదుల అనుసంధానానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సహృదయంతో ముందుకు వచ్చారని అన్నారు. ఇది పూర్తి అయితే చాలా అద్భుతాలు చూస్తామని కెసిఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల తెలివి తక్కువ విధానాల వల్ల తెలంగాణ రైతాంగానికి చాలా నష్టం జరిగిందని కెసిఆర్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా కుచ్ఛితంగా మాట్లాడుతున్నారని కెసిఆర్ ఆరోపించారు. తనకు ఏ గుణం ఉందో అందరికీ ఆదే గుణం ఉంటుందని ఆయన అనుకుంటారని కెసిఆర్ విమర్శించారు. నీచంగా మాట్లాడే వారికే చంద్రబాబు లాంటి ఆలోచనలు వస్తాయని కెసిఆర్ విమర్శించారు.
తామిద్దరు ముఖ్యమంత్రులూ కలిసి నదుల అనుసంధానం విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చామని కెసిఆర్ తెలిపారు. చంద్రబాబు బాబ్లీ మీద గొడవ పడి సాధించింది గుండు సున్నా అని కెసిఆర్ ఎద్దేవా చేశారు. గొడవ పడటం, హంగామా చేయడం, కోర్టుకు వెళ్లడం తప్ప ఆయన సాధించింది ఏమీ లేదని కెసిఆర్ అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సామరస్యంగా చర్చలు జరిపి ఒక పద్దతిగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని కెసిఆర్ గుర్తు చేశారు.
గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం విషయంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు ముందుకు వెళుతున్నాయనీ, అనంతరం ఒప్పందం చేసుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళతామనీ కెసిఆర్ చెప్పారు. ఇది అసాధ్యమేమి కాదని కెసిఆర్ అన్నారు.
పాలమూరు వలసల ప్రాంతం కావడానికి కాంగ్రెస్ నేతలే కారణమని కెసిఆర్ ఆరోపించారు. ఇదే పాలమూరును నీరు లేక ఎండ బెట్టారని కెసిఆర్ దుయ్యబట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 24లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ దుస్థితికి గత పాలకుల విధానాలు కారణం కాదా అని కెసిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు వారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారనీ, వారికి ఏ విషయంపైనా పరిజ్ఞానం లేదనీ కెసిఆర్ విమర్శించారు.
సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంత రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందిస్తామనీ, నీటి తీరువా వసూలు చేయబోమనీ కెసిఆర్ తెలిపారు. రైతాంగం అప్పులు తీరిపోయి వ్యవసాయ పెట్టుబడుల కోసం అప్పులు చేసే స్థితి ఉండకూడదన్నదే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని కెసిఆర్ అన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు.