(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జాతిపిత మహాత్మ గాంధీది హత్య కాదు ప్రమాదమట. ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన రెండు పేజీల పుస్తకంలో రాసుకొచ్చిన విషయమిది. జాతిపిత మహాత్మా గాంధీ ఎలా చనిపోయారు ? అంటే గాడ్సే తుపాకీతో కాల్చి చంపిన విషయం అందరికి తెలుసు. కానీ విద్యాశాఖలో పనిచేసే కొంతమంది మేధావులకు మాత్రం తెలియకుండా పోయింది. ఇటీవల గాంధీ సొంత రాష్ట్రమైన గురాజత్లో పరీక్షాల సందర్భంగా ఓ పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్నంలో ‘ గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు ?‘ అని ముద్రించి విమర్శల పాలయ్యారు. తాజాగా ఒడిశా విద్యాశాఖ కూడా ఇలాంటి ఘన కార్యమే వెలగబెట్టింది. ప్రమాదం కారణంగా మహాత్మగాంధీ చనిపోయారని పేర్కొంటూ ఒడిశా విద్యాశాఖ ప్రచురించిన ఓ బుక్లెట్ తీవ్ర వివాదాస్పదమైంది.
మహాత్మా గాంధీ జయంతోత్సవాల సందర్భంగా ‘ఆమా బాపూజీ : ఏక్ ఝలకా’ బుక్లెట్లో గాంధీజీ ప్రమాదంలో చనిపోయారంటూ ముద్రించారు. అంతేకాదు ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా వివరించే ప్రయత్నం చేశారు. 1948 సంవత్సవరం జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్లో జరిగిన ప్రమాదం గాంధీజీ చనిపోయినట్లు ఉంది. గాంధీ మరణం హత్యగా కాకుండా ప్రమాదంగా వర్ణించడంతో దుమారం చెలరేగింది. ఈ తప్పిదం సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది. విషయం తెలిసిన ఒడిశా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వెంటనే ఆ బుక్లెట్ బయటకు రాకుండా వెనక్కి తీసుకున్నారు.
దీనిపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ స్పందించారు. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని తెలిపారు. ‘‘ఇది రూపొందించిన వారు ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. గాంధీ హత్యకు ఎలా గురయ్యారో వివరించి చెప్పడానికి బదులు, ప్రమాదంగా వర్ణించడమేంటి? వెంటనే ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. రూపకర్తలపై విచారణకు ఆదేశించాం’’ అని రంజన్ దాస్ అన్నారు.
దేశవ్యాప్తంగా గాంధీజీ 150వ జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతుంటే ఆయన చరిత్రను ఇలా వక్రీకరించడం ఏంటని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. గాంధీజీ హత్యను ప్రమాదంగా చెప్పడాన్ని తీవ్రంగా మండిపడుతున్నారు. గాడ్సే సానుభూతిపరులు ఉద్దేశపూర్వకంగా ఈ బుక్ ను ప్రచురించారని విమర్శిస్తున్నారు. గాడ్సే వంటి ఉన్మాది చేతిలో గాంధీ మహాత్ముడు చనిపోయాడని చెప్పకుండా భావితరాలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. భావితరాలను ఇలా అయోమయానికి గురి చేసేలా విద్యా వ్యవస్థ పనిచేయడంపై మండిపడుతున్నారు. ఇలాంటి అధికారులు విద్యాశాఖలో పనిచేస్తే చిన్నారుల భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.