లక్నో: ఉత్తరప్రదేశ్ లో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ.. ఓ వ్యక్తిని ఇద్దరు పోలీసులు చితకబాదారు. రోడ్డుపై లాగి ఘెరంగా కొట్టారు. ఈ ఘటన నేపాల్ సరిహద్దు సిద్ధార్థ్ నగర్ లో గురువారం చోటు చేసుకుంది. ఆ వ్యక్తిని పోలీసులు కొడుతున్నపుడు అతని కుటుంబ సభ్యురాలైన ఓ పాప అక్కడే ఉంది. తన పినతండ్రిని పోలీసులు గొడ్డును బాదినట్లు బాదడం చూసి అ పాప భయకంపితురాలైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యక్తిని దారుణంగా కొట్టిన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
#WATCH: Man thrashed by two police personnel in Siddharthnagar over alleged traffic violation. UP Police have taken cognisance of the incident and suspended the two police personnel. (Viral video) pic.twitter.com/0dWvnSV0lL
— ANI UP (@ANINewsUP) September 13, 2019
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడు.. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహానికి గురయిన సబ్ ఇన్ స్పెక్టర్ వీరేంద్ర మిశ్రా, హెడ్ కానిస్టేబుల్ మహేంద్ర ప్రసాద్ లు ఆ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. నేలపై యువకుడిని పడేసి కాళ్లతో తన్నారు. అంతే కాకుండా ఓ పోలీసు ఆ యువకుడిపై కూర్చొని హింసించాడు. తాను చేసింది తప్పే.. తనను జైల్లో వేయండి అని బాధిత యువకుడు మొర పెట్టుకున్నప్పటికీ పోలీసులు కనికరించకుండా కొట్టారు. ఈ ఘటనను అక్కడ ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఘర్షణ సందర్భంగా ఆ పాప చేతికి గాయం కూడా అయ్యింది. ఆ వ్యక్తికి చెందిన బైక్ తాళాన్ని కూడా పోలీసులు లాక్కున్నారు. దీంతో తానేం తప్పు చేశానని బాధిత యువకుడు పోలీసులను ప్రశ్నించడం ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల ఉన్నతాధికారులు స్పందించారు. యువకుడిని చితకబాదిన సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.