మాకు మాత్రం అదేమీ అవసరం లేదు
ముస్లింలపై కేంద్రమంత్రి గిరిరాజ్ వ్యాఖ్యలు
బెగుసరాయ్: తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి తన విద్వేష ప్రసంగం కొనసాగించారు. మతసామరస్యం కాపాడుతానని ఇటీవలే ఇచ్చిన హామీని మళ్లీ తుంగలో తొక్కారు. బిహార్ లోని బెగుసరాయ్ నియోజకవర్గంలో విద్యార్థినేత కన్నయ్య కుమార్ తో పోటీ పడుతున్న ఆయన.. ఆర్జేడీ అభ్యర్థి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘వందేమాతరం పాడనివాళ్లు, జన్మభూమిని కొలవనివాళ్ల గురించి చెబుతాను. గిరిరాజ్ తండ్రి, తాత సిమరియా ఘాట్ లో గంగానది ఒడ్డున మరణించారు. వాళ్లకు సమాధులు అక్కర్లేదు. కానీ మాకు మాత్రం మూడు గజాల భూమి కావాలి. అలాంటి మీరు జన్మభూమిని గౌరవించకపోతే ఈ దేశం మిమ్మల్ని క్షమించదు’’ అన్నారు. దర్భాంగాలో ఆర్జేడీ అభ్యర్థి అయిన అబ్దుల్ బారీ సిద్దిఖీ వందేమాతరం పాడనని చెప్పారని గిరిరాజ్ అన్నారు.
బీజేపీని విమర్శించేవాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లు పాకిస్థాన్ పోవాలని కూడా ఆయన ఇంతకుముందు వ్యాఖ్యానించారు. ముస్లిం మతానికి సంబంధించిన ఆకుపచ్చ జెండాలను ఎన్నికల కమిషన్ నిషేధించాలని మంగళవారం ఆయన అన్నారు. ఇస్లామిక్ విద్యాసంస్థల నిలయం దేవ్ బంద్ ‘ఉగ్రవాద ఆలయం’ అని నవంబరులో వ్యాఖ్యానించడం తీవ్ర నిరసనలకు దారితీసింది. కానీ, స్వయంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమక్షంలోనే బెగుసరాయ్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ‘‘అభివృద్ధి, మత సామరస్యం ఎలా నిలబెట్టాలో గిరిరాజ్ సింగ్ మీకు చూపిస్తాడు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నితీష్, రాం విలాస్ పాశ్వాన్ ల కలలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాను’’ అని ఆయన అన్నారు. ప్రతిపక్షం మతవిద్వేషాగ్నిని రగిలించే ప్రయత్నం చేస్తోందని.. కానీ భారతీయ జనతా పార్టీ ఉన్నంతకాలం అది సాధ్యం కాదని చెప్పారు. కన్నయ్య కుమార్ పేరు ప్రస్తావించకుండానే అతడినీ గిరిరాజ్ విమర్శించారు. అన్నయ్య కుర్తా, తమ్ముడి పైజమా వేసుకుని కొంతమంది బెగుసరాయ్ కి వచ్చేశారని, వాళ్లు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.