వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి పదేపదే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు. తనకు తెలంగాణా సిఎంకు మధ్య సదవగాహన ఉందని ప్రత్యేకించి అనకపోయినా అందరూ అలానే అర్ధం చేసుకునేలా ఆయన మాటలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారస్థాయిలో ఉండగా ఆయన ఆంగ్ల న్యూస్ ఛానల్ టైమ్స్నౌకి ఇంటర్వ్యూ ఇస్తూ, కెసిఆర్కి ధన్యవాదాలు కూడా తెలిపారు.
మరోపక్క ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీనిని తన ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ ఆయన మోదీ, కెసిఆర్, జగన్ను కలిపి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ ముగ్గురూ కలిసి తనను గద్దె దించేందుకు కుట్ర చేశారనీ, జగన్ ఆధికారంలోకి వస్తే పాలనాపగ్గాలు కెసిఆర్ చేతుల్లో ఉంటాయనీ ఆయన అంటున్నారు. దీని వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? జగన్కు నష్టం జరుగుతుందా? అలా అయితే జగన్ ఎందుకు కావాలని కెసిఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు?
తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికలలో తనకు ఎదురయిన అనుభవాన్ని చంద్రబాబు ఇక్కడ ఉపయోగంలో పెడుతున్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు హైదరాబాద్ ప్రచారానికి వెళ్లగానే కెసిఆర్ గొంతు మారింది. అమరావతిలో కూర్చుని చంద్రబాబు రిమోట్తో తెలంగాణాను పాలిస్తారని ఆయన ప్రచారంలో పదేపదే చెప్పిన మాటలు పని చేశాయి.
తెలంగాణాలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగదని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా తన ప్రచారాన్ని ట్యూన్ చేస్తున్నారు. మరి జగన్కు ఈ విషయం తెలియదనుకోవాలా? కెసిఆర్తో తనకు అవగాహన ఉందని రాష్ట్రప్రజలు భావిస్తే తనకు నష్టం కలగదని ఆయన అనుకుంటున్నారా?
నిజానికి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కెసిఆర్ స్పష్టంగా తన సంఘీభావం ప్రకటించడం జరగలేదు. రాష్ట్రవిభజన సమయంలో టిఆర్ఎస్ వైపు నుంచి సంఘీభావం ఉన్నప్పటికీ తర్వాత తర్వాత ఆ పార్టీనాయకుల గొంతు మారింది. హరీష్ రావు లాంటివారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాను తాము వ్యతిరేకిస్తామని స్పష్టంగా చెప్పారు. ఇటీవల టిఆర్ఎస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది.
వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే జగన్ మాత్రం కెసిఆర్, తాను కలిసి ప్రత్యేకహోదా సాధిస్తామని ప్రకటిస్తున్నారు. జగన్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్నకు ఏ విధంగా ఆలోచించినా ఒకే ఒక్క సమాధానం తప్ప మరోటి కనబడదు. మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు కన్నా కెసిఆర్నే సమర్ధుడిగా పరిగణిస్తారనీ, ఆంధ్రా రాజకీయాలలో కెసిఆర్ జోక్యాన్ని వారు సమర్ధిస్తారనీ జగన్ భావిస్తుండాలి. జగన్ వ్యవహారశైలిని ఇలా తప్ప మరోలా అర్ధం చేసుకోలేం. ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగానే అలా ఆలోచిస్తున్నారా అన్నది. సెంటిమెంట్ అన్నది తెలంగాణా ప్రజలకే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు దానికి అతీతులా అన్నది.