సీజేఐ, నలుగురు జడ్జీలకు రాశా
అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాసినట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన త్రిసభ్య కమిటీ.. ఆమె ఆరోపణలకు సాక్ష్యం ఏమీ లేదని, అందువల్ల సీజేఐ నిర్దోషి అని నిర్ణయించిన విషయం తెలిసిందే.
రఫేల్ రివ్యూ పిటిషన్లపై విచారణ అనంతరం కేకే వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. తాను తన సూచన ముందే ఇచ్చానని ఆయన చెప్పారు. ఏప్రిల్ 22వ తేదీనే తాను సీజేఐతో పాటు నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జీలకు లేఖ రాశానని, జస్టిస్ బాబ్డే కమిటీని 23వ తేదీన నియమించారని ఆయన అన్నారు. అయితే అది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనంటూ ఏప్రిల్ 23న మరో లేఖలో తాను స్పష్టం చేశానన్నారు. కాగా, ఇదే అంశంపై మరో న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫుల్ కోర్టును సమావేశపరచాలని డిమాండు చేసినట్లు ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తన కథనంలో పేర్కొంది. జస్టిస్ బాబ్డేను కలిసిన జస్టిస్ చంద్రచూడ్.. విచారణ కమిటీలో బయటి సభ్యులు ఉండాలని సూచించారు. రిటైర్డ్ న్యాయమూర్తులు రుమా పాల్, సుజాతా మనోహర్, రంజనా దేశాయ్ ల పేర్లను ఆయన ప్రస్తావించారు.
కాగా, ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ బాబ్డేనే నిర్ణయం తీసుకోవాలని ఏప్రిల్ 22న సీజేఐ తెలిపారు. దాంతో ఆయన తాను, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో ఓ కమిటీ నియమించారు. కానీ ఫిర్యాదు చేసిన మహిళ నుంచి అభ్యంతరాలు రావడంతో జస్టిస్ రమణ స్వచ్ఛందంగా ఈ కేసు నుంచి తప్పుకొన్నారు. దాంతో ఆయన స్థానంలో జస్టిస్ ఇందు మల్హోత్రాను నియమించారు. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తికి త్రిసభ్య కమిటీ క్లీన్ చిట్ ఇచ్చినా, దీనిపై రకరకాల వాదోపవాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.