(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భీమవరం: ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వచ్చిందటే చాలు గోదావరి జిల్లాల్లో కోడి పందాలు నిర్వహించడం, పేకాట ఆడడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా ఏపీలో అనేక చోట్ల కోడి పందాల జరుగుతున్నాయి. అవి చట్ట విరుద్ధమని పోలీసుల ఆంక్షలు, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పందెం రాయుళ్లు చాటుమాటుగా పందాలు కాస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులే కోడిపందేలు, పేకాట తదితర జూద క్రీడలు ప్రారంభించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దగ్గరుండి మరీ కోడి పందాలను ప్రారంభించారు. తెలుగు ప్రజల విశిష్ఠ పండగ సంక్రాంతి సంప్రదాయంలో కోడి పందాలు ఓ భాగం అని ఎంపీ అన్నారు. సంప్రాదాయాలను కాపాడుకోవడంలో తప్పేంలేదని, గోదావరి జిల్లాల్లో ఈ పండగకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఎన్నో కోళ్ల జాతులను పరిరక్షించేందుకు ఇదో మంచి అవకాశం అన్నారు. కోడి పందాలతో పాటు, ఎడ్ల పందాలు, పొటేలు పందాలలాంటివి కూడా కాపాడుకోవాలని చెప్పారు. “కోడి పందాలను జగన్ ఆపరు. గోదావరి జిల్లాలో కోడి పందాలను ఎవరూ ఆపలేరు” అని పేర్కొన్నారు. అయితే కత్తులకు మాత్రం తాను వ్యతిరేకమని తెలిపారు.
ఇదిలావుండగా పోలీసుల ఆంక్షలకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో కోడి పందాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. భీమవరం, పెద్దాపురం, నరసాపురం, ఉండి, అమలాపురం, కాకినాడ, గుడివాడ, ఏలూరు, కైకలూరు తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున పందెం రాయుళ్లు బరులు సిద్ధం చేశారు. ఉదయం నుంచి జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. అమలాపురంలోని హిందుపల్లి, కొంకపల్లి, గున్నెపల్లి సహా అల్లవరం మండలంలోని అన్ని గ్రామాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోడి పందాలను ప్రారంభించారు. పోలీసుల ఆంక్షలను ఖాతరు చేయకుండా కోళ్లకు కత్తులు కట్టి, లక్షల్లో పందాలు వేస్తున్నట్టు సమాచారం. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట కూడా జోరుగానే సాగుతున్నాయి. మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు పలు చోట్ల అరెస్టులు చేస్తున్నారు.