(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం ఈ నెల 20వ తేదీ నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం తీసుకునే వైఖరిని బట్టి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నది. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మదు మాట్లాడుతూ వెనకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇతర ప్రాంతాలతో సమానంగా తీసుకురావాలని ప్రజలు కోరుకుంటుంటే దానికి భిన్నంగా ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని విమర్శించారు.
అమరావతి ప్రాంతం రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉంటుదన్న ఉద్దేశంతో నాడు రాజధాని ప్రతిపాదనను వైసిపితో సహా అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయన్నారు. దాన్ని ఈ రోజు జగన్ ప్రభుత్వం వివాదం చేసి మూడు రాజధానుల పేరుతో వికేంద్రీకరణ చేస్తామనడం భావ్యం కాదని మధు పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులు తీవ్ర ఆందోళనకు గురై నిరసనలు వ్యక్తం చేస్తుంటే వారిపై పోలీసుల నిర్భందం హద్దులు మీరుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, మహిళల మీద సాగిస్తున్న దౌర్జన్యకాండను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని రైతుల, వ్యాపారస్తుల, కూలీలందరి సమస్యలు ప్రభుత్వం విని పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అమరావతి పరిపాలనా రాజధానిగానే ఉండాలనీ, వెనకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టి ఆ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడాలనీ, అలాంటి వికేంద్రీకరణ కావాలని రాష్ట్ర ప్రజానీకం కోరుకున్నారని అన్నారు. దాన్ని వైసిపి పెద్దలు వక్రీకరించి అసెంబ్లీ ఒక చోట, సచివాలయం మరో చోట పెట్టడం ద్వారా అది పరిపాలనకు తోడ్పడదనీ, ప్రజలకు సౌలభ్యం కాదనీ మధు అన్నారు.అందరికీ అందుబాటులో ఉన్న అమరావతిలోనే రాజధాని కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రత్యేక నిధులు, రైల్వే జోన్ ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపి.. రాజధాని గురించి ముసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. బిజెపి ద్వంద వైఖరినీ, అవకాశవాదాన్ని ఎండగట్టేందుకు వైసిపి ప్రభుత్వం, ఇతర రాజకీయపక్షాలు పూనుకోవాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు. బిజెపి పట్ల టిడిపి కూడా అవకాశవాదంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రాజెక్టులు, నిధులు, ఇలాంటి వాటి కోసం అందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని మధు పేర్కొన్నారు.
టిడిపి ప్రభుత్వం ప్రకటించిన రాజధాని మోడల్ను తాము మొదటి నుంచి తప్పుపడుతున్నామనీ, ఇప్పుడు కూడా అలాంటి మోడల్ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగానూ దోహదపడదనీ ఆయన అన్నారు.
రాజధాని మార్పుపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలన్న హైపవర్ కమిటీ నిర్ణయంపై మధు స్పందిస్తూ ఇప్పటి వరకూ చాలా మంది రాజధానిపై అభిప్రాయాలను తెలియజేశారనీ, ఇప్పుడు కూడా రాజధాని ప్రాంత రైతులు హైపవర్ కమిటీకి వివరిస్తారని అన్నారు.
రోజువారీ పరిపాలనతో సంబంధలేని హైకోర్టును రాయలసీమలో పెట్టడాన్ని, విశాఖ, అమరావతిలో బెంచీలు పెట్టడాన్ని ప్రజలు అంగీకరిస్తారని చెప్పారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలు చెప్పాలని ఒక పక్క అంటూనే మరో పక్క సిఆర్డిఎను రద్దు చేయాలని ముసాయిదాను పెట్టారన్నాని విమర్శించారు. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండానే, వారితో చర్చించకుండానే ప్రభుత్వం ముందుకు వెళుతోందనీ, దీంతో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.