కాకినాడ: వైసీపీ నేతల భాష దారుణంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో ఇటీవల వైసీపీ దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను మంగళవారం పవన్ పరామర్శించారు. అనంతరం హెలికాన్ టైమ్స్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడులను పవన్ కల్యాణ్ ఖండించారు. తమ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకున్నా దూషించారని అన్నారు. కారణం లేకుండా తమపై దాడికి పాల్పడితే పోలీసులు చోద్యం చూడటం బాధ కలిగించిందన్నారు. నిరసనలు తెలిపే హక్క తమకు ఉందన్నారు. ఘటనకు బాధ్యుడిగా కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకొస్తామంటే ప్రజలు సహించరని చెప్పారు. మమ్మల్ని తిట్టి, మమ్మల్నికొట్టి తిరిగి తమపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.” పచ్చి బూతులు తిట్టి కారణం లేకుండా దాడులు చేస్తారా? 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరేమైనా దిగొచ్చారా ?” అని ధ్వజమెత్తారు.
తాము శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే ‘మీరెవరూ ఉండలేరు’ అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. ఇంకోసారి జనసేన కార్యకర్తలపై ఇలాంటి దాడులు జరిగితే తాము చేతులు కట్టుకొని కూర్చోబోమని వార్నింగ్ ఇచ్చారు. తాము తెగించి రోడ్లపైకి వస్తే ఏమీ చేయలేరని పవన్ వ్యాఖ్యానించారు. తమకు రోడ్లపైకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదన్నారు. తాము చాలా బాధ్యతగా రాజకీయాలు చేస్తున్నామని చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న తమపై ఇలాంటి దాడులు సబబు కాదని, బాధ్యత గల వ్యక్తులం కనుక ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నామన్నారు. కేసులు పెడతామంటే జనసేన ఎప్పుడూ భయపడదని చెప్పారు. తెగించే రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. వైసీపీ నేతలు ఇదే పంథా కొనసాగిస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అధికారం ఎల్లవేళలా ఉండదనే విషయాన్ని వాళ్లు గుర్తు పెట్టుకోవాలని పవన్ హితవు పలికారు. పండుగ సమయంలో ఇలాంటి ఘటనలు బాధాకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కావాలనే లేనిపోని గొడవలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సంఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని పవన్ డిమాండ్ చేశారు. జనసేనికులపై దాడి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి దాడులు చేసినవారిపై కేసులు పెట్టాలని, అన్యాయాలకు పోలీసులు గొడుగు పట్టొద్దని సూచించారు. భవిష్యత్లో ఇలాంటి దాడులు జరిగితే పోలీసులదే బాధ్యతని పవన్ పేర్కొన్నారు.