(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో బిజెపితో కలిసి పనిచేయడానికి జనసేనాని పవన్ అంగీకరించినట్లు సమాచారం.ఢిల్లీలో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో పవన్.. అయన ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.అమరావతి రాజధాని ఉద్యమంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 16న విజయవాడలో జనసేన, బిజెపి నేతల సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనసేనతో కలసి పనిచేయడానికి రాష్ట్ర బిజెపి నాయకత్వం కూడా సుముఖంగా ఉంది.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు, బీఎస్పీ కలసి పోటీ చేసినా పెద్ద ప్రయోజనం కనబడలేదు. దీనితో ఎన్నికల ఫలితాల అనంతరం ఈ పార్టీలు ఆంటీ ముట్టనట్లు గానే ఉన్నాయి. బిజెపితో కలిసి పనిచేయాలని జనసేన నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ మూడు పార్టీలు జనసేనతో దోస్తీ కటీఫ్ చెప్పినట్టు అవుతుంది.