అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళనలు సంక్రాంతి పండగ పూటా కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు బుధవారం నాటికి 29వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడంలో దీక్షా శిబిరాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పండగరోజు పస్తులు ఉంటూ నిరసన తెలుపుతున్నారు. రైతులు రాజధానిని పరిరక్షించుకునేందుకు పండగ రోజు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నారు.
సంక్రాంతి పండగకు దూరంగా ఉంటామంటూ రైతులు ప్రకటన చేసి.. మంగళవారం(జనవరి 14) భోగి మంటల్లో బోస్టస్, జీఎన్ రావు కమిటీ నివేదికలను దహనం చేశారు. ఇవాళ మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు, వెలగపూడి, కృష్ణయపాలెంలో రిలే దీక్షలను రైతులు కొనసాగిస్తున్నారు. ఉద్దంరాయునిపాలెంలో పండగ సందర్భంగా పూజలు నిర్వహించాలని రైతులు నిర్ణయించారు.
మరోవైపు రాజధాని గ్రామాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబాల సభ్యులు బుధవారం పర్యటించనున్నారు. మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి, నందమూరి వసుంధరతోపాటు మరికొందరు కుటుంబ సభ్యులు మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటించి రైతులకు సంఘీభావం తెలపనున్నారు. రైతులు, మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు.