నెల్లూరు, మార్చి 5 : ఆంధ్రప్రదేశ్లో నారాసురుడి పాలన కొనసాగుతోందని ఏపీ ప్రతిపక్ష నేత,వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరులోని ఎస్ వి జి ఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైసిపి సమర శంఖారావం సభలో జగన్ ప్రసంగించారు. ముఖ్య మంత్రి చంద్రబాబుపై విమర్శలు చేశారు.
ప్రజల వ్యక్తిగత వివరాలు అమ్ముకుంటూ ‘ఇది నా డేటా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణమనీ, దొంగతనం చేస్తూ పట్టుబడ్డ బాబు ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా ‘దొంగా..దొంగా’ అంటూ అరుస్తున్నారని జగన్ ఆరోపించారు.
ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ డేటా చంద్రబాబు బినామీ కంపెనీల వద్ద ఉందంటే వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలని జగన్ సూచించారు.
ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండే కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా , ప్రభుత్వం దగ్గర ఉండే ఆధార్ డేటా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంటే తప్పు ఎవరిదని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు బినామీ కంపెనీలపై పోలీసులు దాడులు చేస్తే, ఆంధ్రా పోలీసులను అక్కడికి పంపారని, ఏపీ పోలీసులను తన వాచ్ మన్ లాగా బాబు వాడుకుంటున్నారని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఓ నేరగాడు ప్రజలను పాలిస్తున్న అన్యాయమైన రోజులివని, ఇలాంటి వ్యక్తి సీఎంగా పనిచేయడానికి అర్హుడా అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని జగన్ అన్నారు. రాష్ట్రంలో 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించారనీ, వైసిపి సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. మా సొంత చిన్నాన్న (వైఎస్ వివేకానంద రెడ్డి) ఓటు కూడా తొలగించే యత్నం చేశారని జగన్ చెప్పుకొచ్చారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందు ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు ప్రజలను వంచిస్తున్నాడని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను తానే చంపేసిన చంద్రబాబు… ఇప్పుడు నల్లచొక్కాలతో నిరసనలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని జగన్ విమర్శించారు.