అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం సందర్బంగా తన నవరత్నాలలో ఒకటయిన పెన్షన్ల పెంపునూ, గ్రామ స్థాయి ఉద్యోగాలనూ ప్రకటించడంతో పాటు అవినీతిపై ప్రధానంగా దృష్టి సారించారు. గత టిడిపి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించడంతో పాటు తన నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అవినీతిని రూపుమాపుతుందని ఆయన చెప్పారు. పూర్తి ప్రక్షాళన చేస్తానంటూ ఆయన గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో న్యాయవిచారణ సంఘాన్ని నియమిస్తానని ప్రకటించారు.
ఇవన్నీ ప్రకటిస్తున్న క్రమంలో జగన్, మీడియాకు కూడా హెచ్చరిక చేశారు. కొన్ని మీడియా సంస్థలకు చంద్రబాబు నాయుడు ఒక్కడే ఇంపు అని ఆయన అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు, టివి5 ఛానల్ అంటూ ఆయన పేరు పెట్టి విమర్శించారు. తాను మొత్తం అవినీతిని ప్రక్షాళన చేస్తాననీ, తర్వాత కూడా ఈ ఎల్లో మీడియా దురుద్దేశంతో వార్తలు రాస్తే పరువు నష్టం కేసులు వేస్తామనీ ఆయన హెచ్చరించారు.