అమరావతి: టిడిపి ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రమాణస్వీకారం అనంతరం వేదిక నుండే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్ తన ప్రభుత్వంలో అవినీతికి తావుండదని అన్నారు.
చంద్రబాబు హయాంలో ప్రజలకు ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సివచ్చేదని ఆయన అన్నారు. తాను ఆ పరిస్థితి లేకుండా చేస్తాననీ, ఇంటికొచ్చి తలుపు కొట్టి ప్రభుత్వ సేవలు అందిస్తారనీ జగన్ అన్నారు. స్వచ్ఛమైన అవినీతిరహిత పాలన అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో అంతా అవినీతిమయమై పోయిందని అంటూ దానికి జగన్, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ఉదాహరణలుగా చూపారు. ‘పొరుగు రాష్ట్రాలలో సోలార్ పవర్, విండ్ పవర్ చౌకధరలకు కొంటుంటే, ఇక్కడ అవినీతి కారణంగా ఎక్కువ ధరలకు కొన్నారు. అక్కడ 2:45 నుంచి 3:00 రూపాయలకు యూనిట్ కొంటుండగా ఇక్కడ 4:84 రూపాయలకు కొన్నారు. విద్యుతు వినియోగం అత్యధికంగా ఉండే సమయాల్లో అయితే మరీ అధికంగా 6:00 రూపాయలు చెల్లించారు’ అని జగన్ పేర్కొన్నారు.