అమరావతి: ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ ఆ తర్వాత తన ప్రసంగాన్ని పాదయాత్ర గుర్తు చేసుకుంటూ ప్రారంభించారు. తొమ్మిదేళ్లుగా జనం మధ్య ఉంటూ పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ 3648 కిలోమీటర్లు నడిచినందుకు గాను ప్రజలు తనకు ఆకాశమంతటి విజయాన్ని కట్టబెట్టారని ఆయన అన్నారు.
పాదయాత్రలో పేదలు, మధ్యతరగతి వారి కష్టాలు తను ప్రత్యక్షంగా చూశాననీ, విన్నాననీ జగన్ పేర్కొన్నారు. ‘అందరి కష్టాలూ చూసిన తర్వాత అందరికీ ఇక్కడ ఒక మాట ఇస్తున్నాను. మీ అందరికీ నేనున్నాను’ అని ఆయన ఉద్వేగంగా అన్నారు.
అందరి ఆశలూ, అందరి ఆకాంక్షలూ తీర్చటం ధ్యేయంగా పని చేస్తాననీ, తాను ఇచ్చిన హామీలయిన నవరత్నాల అమలు తనకు అన్నిటికన్నా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పేజీలకు పేజీలు, పుస్తకాలు కాకుండా రెండే రెండు పేజీల ఎన్నికల మ్యానిఫెస్టో తాను ప్రకటించాననీ, అందులో ఉన్న వాగ్దానాలను తుచ తప్పకుండా అమలు చేస్తాననీ జగన్ ప్రకటించారు.
మ్యానిఫెస్టో తనకు ఖురాన్, బైబుల్, భగవద్గీత అంటూ, పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికపై విమర్శలు చేశారు. కులానికొక్క పేజీ రాసి అందరినీ వంచించడం కాదు. పేజీలకు పేజీలు రాసి తర్వాత చెత్తబుట్టలో పడెయ్యడం కాదు. వచ్చే అయిదేళ్లూ వైసిపి మ్యానిఫెస్టో అమలుకు చిత్తశుద్ధితో కృషిచేస్తాను అని జగన్ పేర్కొన్నారు.