Etela Rajender: భుకబ్జా ఆరోపణలతో కేసిఆర్ సర్కార్ నుండి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు నిర్ణయం నేడు తేలనున్నది. ఈటల రెండు రోజుల హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా ఈటల కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తారని..కాదు కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారు అని రకరకాల ఊహగానాలు షికారు చేశాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఈటల సమావేశం అవుతుండటంతో ఆ రకంగా వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల బీజేపీ నుండి పెద్ద ఆఫర్ ఈటలకు వచ్చిందనీ, బీజేపీ రాష్ట్ర నేత బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సీనియర్ బీజేపీ నేత కిషన్ రెడ్డి లు సైతం ఈటలతో ఆ విషయంపై చర్చలు జరిపారని వార్తలు రావడంతో బీజేపీలో చేరిక ఖాయమేనన్నట్లు అందరూ అనుకున్నారు.
అయితే ఈ వార్తలను ఈటల ఖండించారు. తాను త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నాననీ, ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతల మద్దతు కోసం కలుస్తున్నానని చెప్పారు. ఆ వ్యాఖ్యలను ఈటల ఖండించినప్పటికీ రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీకి చేరుకోవడం ఆయన బీజేపీలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లు అవుతోంది. ఈ రోజు ఉదయం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. బీజెపీలో చేరికపై ఆ పార్టీ అగ్రనేతలతో మంతనాలు జరిపేందుకే ఈటల ఢిల్లీకి వెళ్లారన్న మాట వినబడుతోంది.
ప్రధానంగా ఈటల ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీ కానున్నారని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార పార్టీని, కేసిఆర్ ను ఎదుర్కొని నిలబడాలంటే స్వతంత్రంగా ఉంటే సాధ్యపడదనీ, సేఫ్ జోన్ లో ఉండి రాజకీయం చేయాలంటే బీజేపీ గొడుగు కిందకు వెళ్లడమే శ్రేయస్కరమని సన్నిహితులు చెప్పడం వల్లనే ఈటల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రానికి ఈటల బీజేపీ చేరికపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అగ్రనేతలను మర్యాదపూరంగా కలిసి వెళతారా? లేక ఈ రోజే పార్టీ కండువా కప్పుకుంటారా? అనేది సాయంత్రానికి తేలిపోనుంది.